టీడీపీ అధినేత చంద్రబాబుపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈరోజు రాజ్యసభ ఎన్నికలలో ఓటు వేసి వచ్చిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. చంద్రబాబు మీకు విప్ జారీ చేశారా? అని మీడియా ప్రశ్నించగా... 'నాకు విప్ జారీ చేసేంత మగాడా?' అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'విప్ జారీ చేయడానికి చంద్రబాబు వద్ద ఏముంది ఉడకబెట్టిన నాగడి దుంప' అని ఎద్దేవా చేశారు.
టీడీపీ నుంచి తనను బహిష్కరించారని, తనను ప్రత్యేక సభ్యుడిగా స్పీకర్ చూస్తున్నారని వల్లభనేని చెప్పారు. పార్టీ నుంచి సస్పెండైన తనకు విప్ ఎలా జారీ చేస్తారని ప్రశ్నించారు. పక్కనున్న చెంచాల మాట విని పార్టీని చంద్రబాబు నాశనం చేశారని అన్నారు. ఇదే విషయాన్ని గతంలో చంద్రబాబుకు తాను చెప్పానని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చారని కితాబునిచ్చారు.
హైదరాబాదులో ఉన్న కొన్ని చానల్స్ కు డబ్బులు ఇచ్చి వార్తలు రాయించుకుంటున్నారని... ఆ చానల్స్ చంద్రబాబుకు ప్రాణం పోస్తున్నాయని వంశీ అన్నారు. రాజ్యసభ సీటు గెలిచే అవకాశం ఉన్న సమయంలో వ్యాపారవేత్తలకు చంద్రబాబు అవకాశం ఇచ్చారని... సంఖ్యాబలం లేని సమయంలో మాత్రం దళితుడిని రంగంలోకి దించారని విమర్శించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa