ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీమిండియా 226/7

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 12, 2017, 06:45 PM

మహిళల ప్రపంచకప్‌లో టీమిండియా బ్యాటింగ్‌లో అద్భుత ప్రదర్శన చేసింది. ఓపెనర్‌ పూనమ్‌ రౌత్‌ (106: 136 బంతుల్లో 11 ఫోర్లు), కెప్టెన్‌ మిథాలీరాజ్‌ (69: 114: 4 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 226 పరుగులు చేసింది. ఆరంభంలో ఆచితూచి ఆడినప్పటికీ చివర్లో వికెట్లు సమర్పించడంతో భారీ స్కోరు సాధించలేకపోయింది. ఆస్ట్రేలియా బౌలర్లలో స్కట్ట్‌, పెర్రీ రెండేసి వికెట్లు తీయగా.. గార్డనర్‌, బీమ్స్‌ చెరో వికెట్‌ తీశారు.


తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌ స్మృతి మంధాన (3) స్వల్ప స్కోరుకే గార్డనర్‌ బౌలింగ్‌లో వెనుదిరిగింది. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ మిథాలీ ఓపెనర్‌ రౌత్‌తో కలిసి చక్కగా ఆడింది. వికెట్లు కాపాడుకుంటూ సింగిల్స్‌ తీస్తూ వీరిద్దరూ జాగ్రత్తగా ఆడారు. ఈ క్రమంలో అర్ధశతకాలు నమోదు చేశారు. మిథాలీ అత్యధిక పరుగుల ప్రపంచ రికార్డ్‌నూ నమోదుచేసింది. దూకుడుగా ఆడుతున్న ఈ ద్వయాన్ని బీమ్స్‌ విడదీసింది. మిథాలీని ఔట్‌ చేసింది. వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కు 157 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ కొద్దిసేపటికే ఓపెనర్‌ రౌత్‌ కూడా వెనుదిరిగింది. అప్పటికే క్రీజులో ఉన్న హర్మన్‌ప్రీత్‌ కౌర్‌(23) మినహా మిగిలిన వారెవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయారు. స్కోరు చేయడానికి వీలుండే ఓవర్లలో వికెట్లు కోల్పోవడంతో భారీ స్కోరు సాధించడంలో మిడిలార్డర్‌ విఫలమయ్యింది. దీంతో నిర్ణీత ఓవర్లకు 226 పరుగులు మాత్రమే చేయగలిగింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa