ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బంగారం, వెండి మాత్రమే కాదు.. మెటల్‌కీ ఫుల్ డిమాండ్.. రికార్డ్ స్థాయికి ధరలు

business |  Suryaa Desk  | Published : Sun, Dec 28, 2025, 11:30 PM

ఈ 2025 సంవత్సరం లోహాలకు ఒక స్వర్ణ, వెండి యుగంలా చరిత్రలో నిలిచిపోతుంది. ఎందుకంటే బంగారం, వెండి ధరలు విపరీతంగా పెరిగాయి. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధర 78 శాతం మేర పెరిగింది. 2024, డిసెంబర్ 20వ తేదీన తులం బంగారం రేటు రూ.75,233 వద్ద ఉండగా అది 2025, డిసెంబర్ 22 నాటికి రూ.1,33,589కి చేరింది. ఇక వెండి ఊహించని విధంగా ఏకంగా 150 శాతానికి పైగా పెరిగింది. డిసెంబర్ 22 నాటికి కిలో వెండి రేటు రూ.2,31,000 స్థాయికి ఎగబాకింది. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితుల కారణంగా పెట్టుబడిదారులు తమ పోర్ట్ ఫోలియోలను లోహల వైపు మళ్లించారు. బంగారం, వెండి సహా ఇతర విలువైన లోహాల్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు.


ఈ లోహానికీ ఫుల్ డిమాండ్


విలువైన లోహాలు అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేవి బంగారం, వెండి. ఎందుకంటే వాటినే ఎక్కువగా కొనుగోలు చేస్తారు. బంగారం, వెండి ఆభరణాలు ధరిస్తారు. అయితే, ఇంకా చాలా విలువైన లోహాలు ఉన్నాయి. వాటిని మనం పెద్దగా ఉపయోగించమని అనుకుంటాం. కానీ, మనం వినియోగించే ఉత్పత్తుల్లో వాటిని వాడతారని చాలా మందికి తెలియదు. అలాంటి వాటిల్లో రాగి (copper) ఒకటి. ఇప్పుడు ఈ మెటల్‌కి సైతం ఫుల్ డిమాండ్ ఉంది. బంగారం, వెండితో పాటు ఈ లోహంలోనూ మదుపరులు పెట్టుబడులు పెడుతున్నారు. ప్రపంచ వాణిజ్య అనిశ్చితుల కారణంగా విలువైన లోహాల వైపు తమ పెట్టుబడులు మళ్లిస్తున్నారు. దీంతో రాగి ధరలు సైతం విపరీతంగా పెరుగుతున్నాయి. గోల్డ్, సిల్వర్‌తో పాటు ఇన్వెస్టర్ల దృష్టిని కాపర్ ఆకర్షిస్తోంది. దీంతో ఈ వారం రాగి ధరలు సరికొత్త రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి.


డిమాండ్‌కు తగినంత సరఫరా లేకపోవడం, వాణిజ్య అనిశ్చితుల వంటి కారణాలు కాపర్ ధర పెరిగేందుకు కారణమవుతోంది. లండన్ మెటల్ ఎక్స్చేంజీలో మూడు నెలల కాపర్ ఫ్యూచర్స్ ధర టన్నుకు 12,040 డాలర్లకు చేరుకుంది. దీంతో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రాగి ధర 40 శాతం మేర పెరిగింది. 2009 నుంచి చూసుకుంటే ఈ ఏడాదిలోనే భారీగా పెరిగింది. ఎంసీఎక్స్ జనవరి కాపర్ ఫ్యూచర్స్ లో కిలో రాగి ధర జీవన కాల గరిష్ఠ స్థాయి రూ.1181.90కి చేరుకుంది. అలాగే అమెరికా కామెక్స్ కాపర్ ధర ఈ ఏడాదిలో 49 శాతం మేర ర్యాలీ చేసింది.


డిమాండ్‌కు సరిపడా సరిఫరా లేకపోవడం ప్రధాన కారణంగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. వివిధ రాగి గనుల్లో తవ్వకాల్లో అంతరాయం ఏర్పడడం, ఉత్పత్తి అంతంత మాత్రంగానే ఉండడం సరఫరా తగ్గేందుకు కారణమవుతోంది. మరోవైపు అమెరికా సుంకాలు గ్లోబల్ ట్రేడ్ పై ప్రభావం చూపుతుందన్న భయాలు సైతం రాగి ధరలను పెంచుతున్నాయి. దీర్ఘకాలంలో సరఫరా అంతంత మాత్రంగానే ఉండే అవకాశం ఉన్నందున 2026లోనూ రాగి ధర మరింత పెరగవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


మరోవైపు భారత్ వంటి దేశాల్లో భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల వల్ల రాగికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక ఇంధన గ్రిడ్ల తయారీలో రాగి తప్పనిసరి. ఒక సాధారణ పెట్రోల్ కారు కంటే ఎలక్ట్రిక్ కార్లలో 4 రెట్లు ఎక్కువ రాగి అవసరమవుతుంది.


ప్లాటినంలోనూ పెట్టుబడులు


ప్రస్తుతం బంగారం, వెండితో పాటు అత్యధికంగా లాభపడుతున్న లోహాల్లో ప్లాటినం ఒకటి. ఇది కేవలం విలువైన లోహం మాత్రమే కాదు, హైడ్రోజన్ ఎకానమీలో అత్యంత కీలకం. గ్రీన్ హైడ్రోజన్ తయారు చేసే ఎలక్ట్రోలైజర్లలో ప్లాటినంను ఉత్ప్రేరంగా ఉపయోగిస్తారు. దీంతో ఈ మెటల్‌పైనా ఇన్వెస్టర్లు పెట్టుబడులు కుమ్మరిస్తున్నారు. దీంతో డిమాండ్ పెరుగుతోంది. ప్రపంచ ప్లాటినం ఉత్పత్తిలో 70 శాతం వాటా ఉన్న దక్షిణాఫ్రికాలో విద్యుత్తు కొరత, మైనింగ్ సమస్యల వల్ల సరఫరా తగ్గి ధరలు పెరుగుతున్నాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa