రంజాన్.. ముస్లింలకు ఎంతో పవిత్రమైన మాసం. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం తొమ్మిదో నెల అయిన ఈ రమదాన్ లేదా రంజాన్ నెలను వారు ఎంతో పవిత్రమైన మాసంగా భావిస్తారు. అందుకే ఈ నెల మొత్తం ఉపవాసాలు ఉంటూ తమ పాపాలను ఒప్పుకుంటూ, ధార్మిక, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఉదయం సూర్యోదయం నుంచి సాయంత్రం సూర్యాస్తమయం వరకు ముస్లింలు ఉపవాసం ఉంటుంటారు. అయితే ఈ సారి రంజాన్ నెల ఎండాకాలంలో రావడం వల్ల దాహంతో ఇబ్బందిపడే అవకాశాలుంటాయి. అంతేకాదు.. చెమట ఎక్కువగా పట్టడం వల్ల శరీరంలోని నీరు బయటకు వెళ్లిపోయి డీహైడ్రేషన్ కి కూడా గురయ్యే ప్రమాదం ఉంటుంది. ఎండాకాలంలో ఉపవాసం చేయడం చాలా కష్టం. ఎండ వేడికి నీళ్లు కూడా తాగకపోతే చాలా అలసటగా అనిపిస్తుంది. అయితే ఈ కొన్ని పాటించి మీ ఉపవాసాన్ని డీహైడ్రేట్ కాకుండా ప్రశాంతంగా కొనసాగించండి. కాఫీ, టీలు వద్దు. ఈ రెండు రకాల డ్రింకులు చాలా పాపులర్. చాలామందికి అలవాటు. కానీ ఈ రెండింట్లో కెఫీన్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తాగడం వల్ల శరీరంలోని నీళ్లు మొత్తం బయటకు వెళ్లిపోయి డీహైడ్రేషన్ కి గురయ్యే ప్రమాదం ఉంటుంది. ఒకవేళ మీరు వీటిని తాగడం మానేయలేకపోతే వాటి మోతాదును తగ్గించండి. తీపి పదార్థాలు వద్దు. చాలామంది తీపి ఎక్కువగా ఉండే జిలేబీలు, గులాబ్ జామూన్ లు వంటివి ఎక్కువగా తింటుంటారు. ఇవి మీరు బరువు పెరిగేందుకు తోడ్పడడమే కాకుండా ఇందులోని చక్కెరలు ఒక్కసారిగా ఇన్సులిన్ స్పైక్ అందించి తర్వాత ఒక్కసారిగా శక్తిని తగ్గిస్తాయి. ఆ తర్వాత ఆకలి వేస్తుంది. అందుకే వీటిని కాకుండా తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండే ఆహారాలను తీసుకోవడం మంచిది. ఇందుకు గాను ఓట్స్, మిల్లెట్స్, గుడ్లు, మాంసం వంటివి తీసుకోవాలి. ఇవి అరగడానికి చాలా సమయం పడుతుంది. ఫలితంగా మీకు ఆకలి వేయదు. మీకు మిఠాయిలంటే ఎక్కువ ఇష్టం అయితే ఖర్జూరాలు, పండ్లు ఎక్కువగా తీసుకోవచ్చు. కానీ చక్కెర వేసి తయారుచేసిన స్వీట్లకు మాత్రం దూరంగా ఉండడం మంచిది. చాలామంది ఉపవాసం మొదలు పెట్టేందుకు ముందు ఎక్కువ సేపు కడుపు నిండా ఉండేందుకు సమోసాలు, పకోడీలు వంటివి తింటుంటారు. ఇఫ్తార్ లో కూడా ఇలాంటివే ఎక్కువగా ఉంటాయి. అయితే ఇవి మీ శరీరం నుంచి నీరు బయటకు వెళ్లిపోయే ప్రమాదం ఉంటుంది. వీటి బదులుగా పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా పుచ్చకాయ, తర్బూజా, కీర దోస, టొమాటోలు తీసుకోవాలి. వీటిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇవి ఎక్కువ సమయం పాటు శరీరానికి నీటిని అందిస్తాయి. చాలామంది పగలంతా ఆకలి, దాహంతో ఉండి ఇఫ్తార్ సమయంలో ఒకేసారి ఎక్కువ మోతాదులో నీటిని తాగేస్తూ ఉంటారు. కానీ ఇలా చేయడం కూడా సరికాదు. ఇలా చేయడం వల్ల మీ కడుపులోని జీర్ణ రసాలు డైల్యూట్ అయిపోతాయి. ఆ తర్వాత మీరు ఎలాంటి ఆహారం తీసుకున్నా అది సరిగ్గా జీర్ణం అవ్వదు. అందుకే మీరు తక్కువ మోతాదులో నీళ్లు తాగి ఆ తర్వాత ఆహారం తీసుకొని ఆ తర్వాత మరికొన్ని తీసుకోవచ్చు. ఇలా తక్కువ మోతాదులో నీళ్లు తాగడం వల్ల ఒకేసారి శరీరంలోని నీళ్లన్నీ బయటకు వెళ్లిపోయే వీలు కూడా ఉండదు. అందుకే ఒకేసారి నీళ్లు తాగడం సరికాదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa