ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీజేపీ వల్లే ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలింది: అఖిలేశ్ యాదవ్

national |  Suryaa Desk  | Published : Fri, Apr 23, 2021, 04:03 PM

యూపీ రాజధాని లక్నోలో కొవిడ్-19 కంట్రోల్ రూమ్ అధికారులు కనీసం ప్రజలను కలుసుకోవడం గానీ, ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకోవడం గానీ లేదని సమాజ్వాదీ పార్టీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. అలాంటి వారిపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. ''నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ ముఖ్యమంత్రి ప్రతిరోజూ చెబుతుంటారు. కానీ రాజధాని లక్నోలో అధికారులు కనీసం ప్రజలను కలుసుకోవడం గానీ, ఫోన్ కాల్స్‌కు స్పందించడం గానీ చేయడం లేదు. అక్కడ ప్రజల బాధలను పట్టించుకునే నాథుడే లేడు. అలాంటి అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు..'' అని ఆయన ఓ ప్రకటనలో ప్రభుత్వాన్ని నిలదీశారు. ఉత్తర ప్రదేశ్‌లో ప్రభుత్వ కార్యకలాపాలు పడకేశాయనీ... కొవిడ్-19 కారణంగా ప్రజలు పిట్టల్ల రాలిపోతున్నారని ఆయన ఆరోపించారు. ''ఇలాంటి పరిస్థితుల్లో కొంత మంది అక్రమార్కులు ఆక్సిజన్ సిలిండర్లు, మందులు, వెంటిలేటర్లను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారు. రోగులకు కనీసం ఆస్పత్రి బెడ్లు కూడా దొరకడం లేదు. ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలడానికి బీజేపీనే కారణం...'' అని అఖిలేశ్ పేర్కొన్నారు. ప్రస్తుతం కల్లోలాన్ని బీజేపీ ''అవకాశంగా'' మార్చుకుందనీ... అన్నీ బ్లాక్ మార్కెట్లోనే దొరుకుతున్నాయని ఆయన ఆరోపించారు. కాగా ఉత్తర ప్రదేశ్‌లో గడచిన 24 గంటల్లో 34,379 కొవిడ్-19 కేసులు నమోదు కాగా.. మరో 195 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇక్కడ మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,76,765కి చేరుకోగా.. మృతుల సంఖ్య 10,541కి పెరిగిందని అధికారులు వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa