మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుకు సీఐడీ మరో షాక్ ఇచ్చింది. శుక్రవారం అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై వీడియో మార్ఫింగ్ వ్యవహారంపై ఆయనకు నోటీసులిచ్చారు. మే 1న ఉదయం 11గంటలకు మరోసారి విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఉమా గురువారం మంగళగిరి సీఐడీ కార్యాలయంలో విచారణకు వెళ్లారు. ఆయన ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందని సీఐడీ అధికారులు మరోసారి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు.
గురువారం జరిగిన సీఐడీ విచారణలో చంద్రబాబు పేరు చెప్పాలని తనపై ఒత్తిడి తెచ్చారని ఉమా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను చెప్పని విషయాలు కూడా చెప్పినట్లు.. దర్యాప్తు అధికారులు వారికి ఇష్టమొచ్చినట్లు స్టేట్మెంట్లు రాసుకుని వాటిపై సంతకాలు చేయాలంటూ బెదిరించారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు, టీడీపీ ఆదేశాల మేరకే మీడియా సమావేశంలో వీడియో ప్రదర్శించానని చెప్పాలంటూ ఒత్తిడి చేశారన్నారు. తప్పుడు కేసులకు భయపడేది లేదని ఉమా అన్నారు. తన గొంతు నొక్కాలనుకుంటున్నారని.. హైకోర్టు ఆదేశాలను గౌరవిస్తూ విచారణకు హాజరైనట్లు చెప్పారు.
దేవినేని ఉమా ఈ నెల 7న తిరుపతిలో నిర్వహించిన ఓ మీడియా సమావేశంలో ప్రదర్శించిన వీడియోపై దుమారం రేగింది. తిరుపతి రావటానికి ఎవరు ఇష్టపడతారని జగన్ గతంలో వ్యాఖ్యానించినట్లు మార్ఫింగ్ వీడియోను ప్రదర్శించారని వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేయడంతో ఈ నెల 7న సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఉమా హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు ఆయన సీఐడీ అధికారుల ఎదుట హాజరయ్యారు. దాదాపు 9 గంటల పాటు ఆయన్ను దర్యాప్తు అధికారులు ప్రశ్నించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa