2021 టీ20 ప్రపంచకప్ను భారత్ ఓటమితో ప్రారంభించింది. ఆదివారం రాత్రి చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో తలపడి పది వికెట్ల తేడాతో ఘోర పరాభవం ఎదుర్కొంది. దీంతో ప్రపంచకప్ టోర్నీల్లో సంపూర్ణ ఆధిపత్యానికి తెరపడింది. అయితే, గతరాత్రి జరిగిన మ్యాచ్లో టీమ్ఇండియా బ్యాట్స్మన్ కేఎల్ రాహుల్ (3) ఔటైన బంతి చర్చనీయాంశమైంది. అతడు నోబాల్కు పెవిలియన్ చేరాడంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. షహీన్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్ తొలి బంతికి రాహుల్ బౌల్డయ్యాడు. కానీ.. బంతి వేసినపుడు షహీన్ కాలు గీత దాటినట్లుగా వీడియోలో కనిపించింది. అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లను అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు. దీనిపై ఎవరూ స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 151/7 సాధారణ స్కోర్ చేసింది. తొలి ఓవర్లోనే ఓపెనర్ రోహిత్ శర్మ (0) షహీన్ బౌలింగ్లో డకౌటయ్యాడు. ఆపై మూడో ఓవర్లో రాహుల్ పెవిలియన్ చేరాడు. కాసేపటికే సూర్యకుమార్(11) సైతం ఔటవ్వడంతో భారత్ 31 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆపై కెప్టెన్ విరాట్ కోహ్లీ (57; 49 బంతుల్లో 5x4, 1x6), వికెట్ కీపర్ రిషభ్ పంత్ (39; 30 బంతుల్లో 2x4, 2x6) కాస్త పోరాడి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. చివర్లో ధాటిగా ఆడతారనుకున్న రవీంద్ర జడేజా (13), హార్దిక్ పాండ్య (11) పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. అనంతరం పాకిస్థాన్ 17.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. ఓపెనర్లు రిజ్వాన్ (79; 55 బంతుల్లో 6x4, 3x6), బాబర్ అజామ్ (68; 52 బంతుల్లో 6x4, 2x6) నాటౌట్గా నిలిచి పాక్ను గెలిపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa