కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. దేశ ప్రజల ఆరోగ్యం కోసం ‘ఆత్మనిర్భర్ స్వస్థ్ భారత్ యోజన’ను సోమవారం ప్రారంభించనుంది. ప్రధాని మోదీను తన వారణాసి పర్యటనలో ఈ సరికొత్త పథకాన్ని లాంచ్ చేయనున్నారు. ఈ పథకానికి 64,180 కోట్లను కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. వచ్చే ఆరేళ్లకు (2025–26 ఆర్థిక సంవత్సరం వరకు) గాను ఈ మోత్తాన్ని కేటాయించింది. ఫిబ్రవరి బడ్జెట్ సెషన్లోనే దీనికి ఆమోదం తెలిపింది. ఈ పథకం జాతీయ ఆరోగ్య మిషన్కి అదనంగా ఉంటుందని కేంద్రం ఒక ప్రకటనలో పేర్కొంది.కోవిడ్ సంక్షోభ సమయంలో సరిపడా ఆసుపత్రులు, ఆక్సిజన్ సిలిండర్లు లేక ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు దేశవ్యాప్తంగా వైద్య సదుపాయాలు పెంచాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించింది. అందుకే, ప్రధాని మోదీ ఈ సరికొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రకటన ప్రకారం, ప్రధాని మోదీ స్వంత పార్లమెంటరీ నియోజకవర్గం అయిన వారణాసి నుండి ఈ ప్రాజెక్టును ఉత్తర ప్రదేశ్ ఎన్నికల పర్యటనలో భాగంగా ప్రారంభించనున్నారు. దీనితో పాటు సిద్ధార్థ్ నగర్లో తొమ్మిది కొత్త మెడికల్ కాలేజీలను కూడా ఆయన ప్రారంభించబోతున్నారు.ప్రాథమిక, ద్వితీయ, తృతీయ ఇలా అన్ని స్థాయిలలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను బలోపేతం చేయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. కరోనా వంటి భవిష్యత్తు విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను సిద్ధం చేయడంపై ఈ పథకం ప్రధానంగా దృష్టి పెడుతుంది. ఈ పథకం కింద, 10 హై-ఫోకస్ రాష్ట్రాల్లోని 17,788 గ్రామీణ ఆరోగ్య, ఆరోగ్య కేంద్రాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపర్చనుంది. మరోవైపు కొత్తగా 11,024 అర్బన్ హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు.ఇవే కాకుండా 5 లక్షలకు పైగా జనాభా కలిగిన జిల్లాల్లో ఆరోగ్య సంరక్షణ సేవలను మరింత బలోపేతం చేయనున్నారు. ఈ స్కీమ్ కింద, ఒక నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ వన్ హెల్త్, 4 కొత్త నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఫర్ వైరాలజీ, 9 బయోసేఫ్టీ లెవల్ III లేబొరేటరీలు, 5 రీజినల్ నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ సెంటర్లు, సౌత్ ఈస్ట్ ఆసియా రీజియన్ కోసం డబ్ల్యూహెచ్ఓ రీజినల్ రీసెర్చ్ ప్లాట్ఫారమ్ ఏర్పాటు కానున్నాయి. కాగా, రానున్న ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్కడ పెద్ద ఎత్తున వరాల జల్లు కురిపిస్తోంది బీజేపీ ప్రభుత్వం. ఇందులో భాగంగా వారణాసిలో రూ. 5,200 కోట్ల కంటే ఎక్కువ విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను మోదీ ఇవాళ ప్రారంభించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa