చేనేత రంగానికి మరణశాసనంగా మారిన జిఎస్టీ పెంపు అంశంపై కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలంటూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. వైసీపీ ప్రభుత్వ చిన్నచూపు, కరోనా కారణంగా చేనేత రంగం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిందని ఆయన విమర్శించారు. చేనేత రంగానికి అండగా నిలిచిన సంక్షేమ కార్యక్రమాలు, సబ్సిడీలు, తక్కువ వడ్డీకే రుణాలు, ఆప్కో ద్వారా కొనుగోళ్లు, నేతన్నలకు ప్రోత్సాహకాలు లాంటి అనేక కార్యక్రమాలను వైసిపి ప్రభుత్వం నీరుగార్చడమే చేనేత రంగం గడ్డు పరిస్థితి ఎదుర్కోవడానికి ప్రధాన కారణమని పేర్కొన్నారు. సీఎంకు రాసిన లేఖలో నారా లోకేష్ ఇలా పేర్కొన్నారు...చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చేనేత ఉత్పత్తుల పై 5 శాతం జీఎస్టీ విధించడమే పెనుభారమైతే ఇప్పుడు ఏకంగా దానిని 12 శాతానికి పెంచడం మరణశాసనమే. రంగులు, రసాయనాలు, నూలు ధరలు, రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడంతో లాభం 2 నుండి 5 శాతం రావడమే గగనంగా మారింది. తాజా జీఎస్టీ పెంపు నిర్ణయంతో చేనేత పరిశ్రమకు తీవ్ర నష్టం వాటిల్లడమే కాకుండా ఆ రంగాన్ని నమ్ముకొని జీవిస్తున్న వేలాది మంది
కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. తమిళనాడు, తెలంగాణతో పాటు అనేక రాష్ట్రాలు చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ పెంపుని తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఒత్తిడి పెంచుతున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తి నట్లు వ్యవహరిస్తుంది. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ కేంద్రం పై ఒత్తిడి తీసుకురావాలి. ఒకవేళ అది సాధ్యం కాకపోతే చేనేత రంగంపై జీఎస్టీ భారం 5 శాతాన్ని మించకుండా సబ్సిడీలు కల్పించాలి. చేనేత ఉత్పత్తుల కొనుగోలుకు ఆప్కో ని సమర్థవంతంగా వినియోగించాలి. చేనేత కళ ని కాపాడటానికి గత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, సబ్సిడీలు, తక్కువ వడ్డీకే రుణాలు, ఆప్కో ద్వారా కొనుగోళ్లు, నేతన్నలకు ప్రోత్సాహకాలను తిరిగి అమలు చెయ్యాలి. భారతదేశ వస్త్ర సంప్రదాయంలో ఆంధ్రప్రదేశ్ చేనేతకు ప్రత్యేక స్థానం ఉంది. ఎంతో ఘన చరిత్ర ఉన్న చేనేత కళను, నేత కళాకారులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉంది. పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిన చేనేత పరిశ్రమను తిరిగి గాడిన పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉదారంగా ఆదుకోవాలి. నేత కళాకారులని గుర్తించి సంక్షేమ కార్యక్రమాలు అమలు చెయ్యాలి.అని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa