ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మీ తప్పును కప్పిపుచ్చుకునేందుకు పరనిందలేల:కె రామకృష్ణ.

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 30, 2021, 07:04 PM

అమరావతి రాజధాని విషయంలో వైసిపి చేసిన మోసాన్ని కప్పిపుచ్చుకునేందుకే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇతర పార్టీలపై నిందలు వేస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు కె.రామకృష్ణ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనలో ఆయన ఇలా పేర్కొన్నారు. ఏపీలో అధికార పార్టీగా ఉన్న వై ఎస్ ఆర్ సి పి రాజధాని అంశాన్ని అవకాశవాదంగా మార్చుకుంది. వైసిపి తీసుకున్న 3 రాజధానుల ఏర్పాటు నిర్ణయాన్ని రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ అయినా సమర్థించిందా, అమరావతి రాజధానిగా ఉండటం సరైన నిర్ణయం అని వైసిపి ప్రతిపక్షంలో ఉండగా చెప్పిన మాట వాస్తవమా కాదా? ఇప్పుడు సిపిఐ, కాంగ్రెస్, బిజెపి, జనసేన, తెలుగుదేశం చంద్రబాబు నాయుడు కనుసన్నల్లో నడుస్తున్నాయని సజ్జల చెప్పటం భావ్యమేనా, ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని చంద్రబాబు కోరినప్పుడు సిపిఐ పార్టీగా మేము దాన్ని వ్యతిరేకించిన విషయం సజ్జల గారు మరిచారా, 'మాట మార్చం -  మడమ తిప్పం' అన్న జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి విషయంలో మాట మార్చి, మడం తిప్పారా లేదా, వైసిపి గత రెండున్నర ఏళ్లుగా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూ, ఇప్పుడు ఇతరులపై నిందలేయడం తగునా, తిరుపతిలో అమరావతి రైతుల సభకు పోటీగా మీరు సభ పెట్టి ఫెయిల్ అవ్వలేదా, అధిక ధరలు, పన్నుల భారాలు, ఉద్యోగులకు పీఆర్సీ అమలు, సిపిఎస్ రద్దు, విద్యుత్ ఛార్జీల పెంపుదల వంటి పలు అంశాల్లో మాట తప్పిన ప్రభుత్వం వైసీపీ కాదా, పరనింద లేసేముందు  స్వయంకృతాపరాధాలు  వైసీపీ గుర్తెరగాలి. మీరు చేసే మోసాన్ని సమర్థిస్తేనే మంచివాళ్లు, లేకుంటే చెడ్డ వాళ్లవుతారా, సజ్జల గారు... ప్రభుత్వ సలహాదారుగా ఉన్న మీరు విజ్ఞత మరచి మాట్లాడటం సరికాదు. వైసిపి మోసపూరిత విధానాలను ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా అంగీకరించే పరిస్థితి లేదు. 'ఆడలేక మద్దెల ఓడు' అన్న చందంగా వైయస్సార్ సిపి వైఖరి ఉంది. అని ఆయన విమర్శించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa