మన దేశంలో మరో శక్తివంతమైన క్షిపణి ఎస్-400 ట్రయంఫ్ అందుబాటులోకి రానున్నది. ఫిబ్రవరి నుంచి ఈ క్షిపణి అందుబాటులోకి రానుంది. రష్యా ఈ క్షిపణిని 1993లో అభివృద్ధి చేయడం ప్రారంభించింది. మాస్కోకు చెందిన అల్మాజ్ సెంట్రల్ డిజైన్ బ్యూరో ఎస్-400 క్షిపణిని తయారు చేసింది. ఇది 400 కిలోమీటర్ల పరిధిలోని ఎలాంటి లక్ష్యాన్నైనా ఛేదిస్తుంది. మిస్సైల్ స్టోరేజ్ కంటైనర్లు, లాంఛర్లు, రాడార్లు, ఇతర ఆయుధాలతో దీన్ని తయారు చేశారు. 2007లో ఇది వినియోగంలోకి వచ్చింది. ఐదు యూనిట్ల ఎస్-400 క్షిపణి రక్షక వ్యవస్థను రష్యా నుంచి తీసుకునేందుకు భారత్ 2018లో ఒప్పందం చేసుకుంది. వచ్చే ఫిబ్రవరి నుంచి వీటిని మోహరించేలా భారత్ సైన్యం సన్నాహాలు చేస్తోంది.
ఇదిలా ఉంటే పాక్, చైనా నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో.. రక్షణ వ్యవస్థ బలోపేతంపై కేంద్రం దృష్టి సారించింది. ఇందులో భాగంగా శక్తివంతమైన క్షిపణులను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. ముఖ్యంగా అధునాతన క్షిపణి వ్యవస్థ అయిన ఎస్-400 ట్రయంఫ్ను రష్యా నుంచి కొనుగోలు చేసింది. ఎస్-400 రెజిమెంట్ మోహరింపు వచ్చే నెలకల్లా పూర్తి కానుంది. పంజాబ్లోని వైమానిక స్థావరంలో దీనిని ఏర్పాటు చేస్తున్నట్టు భారత్ సైన్యం ప్రకటించింది. ఈ క్షిపణి ప్రక్రియ పూర్తయ్యేటప్పటికి ఆరు వారాలు పడుతుందని, దానికి సంబంధించిన ముఖ్యమైన విడి భాగాలు, ఇతర పరికరాలను తరలిస్తున్నట్టు సైన్యాధికారులు తెలిపారు. ఇది అందుబాటులోకి వస్తే ఉత్తర సెక్టార్లోని చైనా సరిహద్దు ప్రాంతంతోపాటు పాకిస్థాన్ సరిహద్దులు సైతం ఈ క్షిపణి వ్యవస్థ పరిధిలోకి వస్తాయని అధికారులు తెలిపారు. ఎస్-400 ట్రయంఫ్ అనేది భూమిపై నుంచి గగనతలానికి ప్రయోగించే ఓ క్షిపణి వ్యవస్థ. ఎటువంటి గగనతల ప్రమాదాన్నైనా పసిగట్టి నేలకూల్చడం దీని ప్రత్యేకత. ఈ క్షిపణి ఆకాశంలో దూసుకొచ్చే శత్రువుల విమానాలను, డ్రోన్లను, రాకెట్లను భూమిపై నుంచి కూల్చేయగలదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa