రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలా అని గోతికాడ నక్కల్లా కాచుకుని ఉండే మీవంటి వారితో నీతులు చెప్పించుకునే పరిస్థితిలో ఏపీ బీజేపీ లేదని విజయసాయిరెడ్డికి కౌంటరర్ ఇస్తూ ఏపీ బీజేపీ చీఫ్ సోమువీర్రాజు బదులిచ్చారు. నిత్యం ల్యాండ్, శాండ్, వైన్ ద్వారా పేద ప్రజల కష్టాన్ని పీక్కుతినే రాబందుల వంటి మీరా మాకు హితబోధ చేసేది? అంటూ ఆగ్రహం వెలిబుచ్చారు. విశాఖ భూములపై కన్నేసి మూడు రాజధానులంటూ కుట్రలకు తెరదీసిన మీ నీతులు మాకు అవసరంలేదని సోము వీర్రాజు స్పష్టం చేశారు. "గుంటూరు జిన్నా టవర్, విశాఖ కేజీహెచ్ పేర్లు మార్చాలంటున్న ఏపీ బీజేపీ నేతలవి మరుగుజ్జు ఆలోచనలు" అంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించడం తెలిసిందే. దీనిపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఘాటుగా స్పందించారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేదీ, అమరావతిని నిర్మించేదీ, విశాఖ ఉక్కు పరిశ్రమను పరిరక్షించేదీ, ప్రత్యేక ప్యాకేజీ నిధులు ఇచ్చేదీ, రాష్ట్రంలో అనేక మౌలిక సదుపాయాలు కల్పించి ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేస్తున్నదీ నరేంద్ర మోదీ ప్రభుత్వమేనని సోము వీర్రాజు ఉద్ఘాటించారు. దేశ ద్రోహుల పేర్లు మీరు మార్చకపోతే, ఏపీలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే తప్పకుండా వాటి పేర్లు మార్చుతుందని స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa