పంజాబ్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సీఎం అభ్యర్థిని ప్రజలే ఎన్నుకునేలా ఆ పార్టీ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. ప్రజలే సీఎం అభ్యర్థిని ఎన్నుకునేలా ఓ ఫోన్ నంబర్ ను ఏర్పాటు చేశారు. సీఎంగా ఎవరు కావాలో ఆ నెంబర్ కు ఫోన్ చేసి అభ్యర్థి పేరు చెప్పాలని సూచించారు. 7074870748 నెంబర్ కు ఫోన్ చేసి అభిప్రాయం చెప్పొచ్చని అన్నారు. ఇన్నేళ్ల నుంచి ఎన్నికలు జరుగుతున్నా.. బహుశా ఎప్పుడూ ఏ పార్టీ కూడా ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉండదన్నారు. దేశ చర్రితలోనే సీఎం అభ్యర్థిని ప్రజలే ఎన్నుకోవడం ఇదే తొలిసారి కావొచ్చునని పేర్కొన్నారు. ఫోన్ చేసి గానీ, వాట్సాప్ లో మెసేజ్ ద్వారా గానీ ప్రజలు అభిప్రాయం చెప్పొచ్చని తెలిపారు. జనవరి 17 సాయంత్రం 5 గంటల లోపు ప్రజలు తమ అభీష్టాన్ని చెప్పాలన్నారు.
వాస్తవానికి ఆప్ సీఎం అభ్యర్థిగా భగవంత్ మన్ ఉన్నా ఆయనపై చాలా మంది నేతలు, ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. ఆ విషయంలోనూ కేజ్రీవాల్ స్పందించారు. భగవంత్ మన్ తనకు అత్యంత కావాల్సిన వ్యక్తి అని అన్నారు. తాము ఆయన్నే అభ్యర్థిగా ప్రకటించాలనుకున్నా.. ఆ నిర్ణయాన్ని ప్రజలకే వదిలేద్దామంటూ ఆయనే సలహా ఇచ్చారని పేర్కొన్నారు. తలుపులన్నీ మూసేసి నాలుగు గదుల మధ్య సీఎం అభ్యర్థిని నిర్ణయించడం మంచి పద్ధతి కాదంటూ ఆయన కూడా చెప్పారన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa