మానవ జీవితం సమస్యల వలయమని, వీటి నుండి బయటపడాలంటే హరినామస్మరణ ఒక్కటే మార్గమని బెంగళూరులోని కుక్కే సుబ్రమణ్య మఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యాప్రసన్నతీర్థ స్వామీజీ ఉద్ఘాటించారు. శ్రీవారి పరమభక్తుడు, కర్ణాటక సంగీత పితామహుడు అయిన శ్రీపురందరదాసుల ఆరాధన మహోత్సవాలు టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో సోమవారం తిరుమలలోని ఆస్థాన మండపంలో ఘనంగా ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా శ్రీశ్రీశ్రీ విద్యాప్రసన్నతీర్థ స్వామీజీ మంగళాశాసనాలు అందిస్తూ శ్రీవేంకటేశ్వరుడు శ్రీ వైకుంఠం నుండి తిరుమలపై కాలుమోపి సకల జీవరాశులను రక్షిస్తున్నారని అన్నారు. శ్రీ పురందరదాసులవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన ప్రతిసారి సహస్ర దళ సంకీర్తన రత్నాలతో స్వామివారి పాదపద్మాలను సేవించినట్లు తెలిపారు. శ్రీగిరి పర్వతానికి అధిపతి అయిన శ్రీనివాసుడిని సంకీర్తనలతో మేల్కొలిపే వారన్నారు. శ్రీవారి అనుగ్రహం కొరకు ఆకాశరాజు శ్రీ పద్మావతి అమ్మవారిని స్వామివారికి సమర్పించినట్లు, మనం సంకీర్తనలు, మంత్ర, స్త్రోత్ర పారాయణంతో శ్రీనివాసుడి అనుగ్రహం పొందవచ్చన్నారు.
అనంతరం బెంగళూరులోని శ్రీ రాఘవేంద్రస్వామి మఠాధిపతి శ్రీ సువిధ్యేంద్రతీర్థ స్వామీజీ అనుగ్రహ భాషణం చేస్తూ భగవంతుని చేరాలంటే ముందు ఆయన పరమభక్తుల అనుగ్రహం అవసరమని పురాణాలు పేర్కొంటున్నాయని, ఈ కోవకు చెందిన పరమ భక్తుడు శ్రీ పురందరదాసు అన్నారు. ఇలాంటి పరమ భక్తులను గౌరవిస్తూ జయంతి, వర్ధంతులను నిర్వహించడం ద్వారా భగవంతుడు సంతోషపడతారన్నారు. నేడు వేలాది మంది భక్తులు పురందరదాసు రచించిన లక్షలాది కీర్తనలు ఆలపిస్తూ స్వామివారి కృపకు పాత్రులు అవుతున్నారని, ఇదే కలియుగంలో నామసంకీర్తనకున్న వైశిష్ట్యమన్నారు. శ్రీ పురందరదాసులవారు దాస పదాల ద్వారా అందరికీ అర్థమయ్యేలా సులువుగా భగవంతుని తత్తాన్ని, శరణాగతి విధానాన్ని తెలియజేశారని వివరించారు.
టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ ఆనందతీర్థాచార్యులు మాట్లాడుతూ 4. 75 లక్షల సంకీర్తనలు రచించడం దైవాంశ సంభూతుడు, సాక్షాత్తు నారద స్వరూపులైన శ్రీ పురందరదాసుకే సాధ్యమైందని తెలిపారు. పురందరదాసు కీర్తనలు యావత్తూ లోకోక్తులేనన్నారు. మానవాళికి పురందరదాసు జీవితసారమే ఆదర్శప్రాయమన్నారు. అనంతరం స్వామీజీని శాలువ, శ్రీవారి ప్రసాదంతో సన్మానించారు.
అంతకుముందు ఉదయం సుప్రభాతం, ధ్యానం, సామూహిక భజన, నగర సంకీర్తన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు దాస సంకీర్తనలను భజన మండళ్ల సభ్యులు చక్కగా ఆలపించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి పలువురు భజన మండళ్ల సభ్యులు పాల్గొన్నారు.
ఫిబ్రవరి 1న వైభవోత్సవ మండపంలో సంకీర్తనాలాపన
ఆరాధనోత్సవాల్లో రెండవ రోజైన ఫిబ్రవరి 1న మంగళవారం సాయంత్రం 6 గంటలకు శ్రీవారి ఆలయం వద్దగల వైభవోత్సవ మండపానికి శ్రీవారి ఉత్సవమూర్తులను వేంచేపు చేసి శ్రీ పురందరదాస సంకీర్తనల బృందగానం నిర్వహిస్తారు. ఫిబ్రవరి 2న తిరుమలలోని ఆస్థానమండపంలో భజన కార్యక్రమాలు, నగర సంకీర్తనం తదితర కార్యక్రమాలు చేపడతారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa