పల్నాటి పౌరుషాన్ని, సత్తాను చాటాల్సిన సమయం ఆసన్నమైందని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. గురజాల చల్లగుండ్ల గార్డెన్స్ ఆవరణలో సోమవారం నిర్వహించిన గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లా సాధన అఖిలపక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పల్నాడుకు ఎటువంటి సంబంధం లేని నరసరావుపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు.
పల్నాడు ప్రజానీకం జిల్లా కేంద్రం గురజాల కోసం పట్టుపట్టి రాజకీయాలకు అతీతంగా పూర్తిస్థాయిలో ఉద్యమించాలని తెలిపారు. ఉద్యమ సెగ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఉన్న ముఖ్యమంత్రి జగన్కు తాకాలన్నారు. 9 వందల చారిత్రక నేపథ్యం ఉన్న పల్నాడు నడిబొడ్డు గురజాలను కేంద్రం చేయాలని సూచించారు. బ్రహ్మనాయుడు, నాయకురాలు నాగమ్మ, మాల కన్నమదాసు వంటి మహావీరులు నడియాడిన ప్రాంతం, స్వాతంత్య్ర సమరంలో పుల్లరి ఉద్యమ నాయకుడు కన్నెగంటి హనుమంతు పుట్టిన నేల ఇదన్నారు.
నరసరావుపేట నుంచి గురజాలకు వచ్చిన ప్రస్తుత శాసనసభ్యుడు సైతం జిల్లా కేంద్రంపై మాట్లాడాలని కోరారు. మండల, గ్రామస్థాయిలో ఉద్యమాలు, 50 వేల మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని, ధిల్లీ పెద్దలను కలిసి జంతర్మంతర్లో ధర్నా చేస్తామన్నారు. జిల్లా కేంద్రంగా గురజాలను ప్రకటించే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. జేఏసీ ఛైర్మన్ కృష్ణాంజనేయులు, జనసేన నుంచి కటకం అంకారావు, సీపీఎం నుంచి హైనా మస్తాన్, సీపీఐ నుంచి వేముల వెంకటరెడ్డి, భాజపా నుంచి పెనుగొండ అమృతలింగేశ్వరరావు, కాంగ్రెస్ నుంచి కరాలపాటి జాని, నేషనల్ నవక్రాంతి పార్టీ అధ్యక్షుడు కనకం శ్రీనివాసరావు, పల్నాడు ప్రజా సేవా సమితి అధ్యక్షుడు ముళ్లపాటి కృష్ణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa