ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రెండో వన్డే కోసం భారత బ్యాట్స్‌మెన్ కసరత్తులు

national |  Suryaa Desk  | Published : Tue, Feb 08, 2022, 09:39 AM

వెస్టిండీస్‌తో జరిగే రెండో వన్డే కోసం భారత జట్టు సిద్ధంగా ఉంది. తొలి వన్డేలో మన ఆటగాళ్లు రెచ్చిపోవడంతో టీమిండియా విజయం నల్లేరు మీద నడకైంది.


 


ప్రత్యర్థి జట్టును తక్కువ పరుగులకే కట్టడి చేయడంతో పాటు భారత బౌలర్లు అద్భుతంగా రాణించడంతో అలవోకగా విజయం సాధించింది. అయితే, ఫిబ్రవరి 9న అహ్మదాబాద్ వేదికగా భారత్ వెస్టిండీస్‌తో మరోసారి తలపడనుంది. ఈ క్రమంలోనే రెండో వన్డేకు ఒక్కరోజు ముందు బ్యాటర్లు కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, నవదీప్ సైనీలు సోమవారం ప్రాక్టీస్ సెషన్‌లో కనిపించారు.


 


ఈ ముగ్గురు బ్యాటర్లు తిరిగి జట్టులో భాగమయ్యారని, మైదానంలో శ్రమిస్తున్న ఫోటోలను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. తుది జట్టులో స్థానం కోసం వీరంతా తీవ్రంగా చెమటోడుస్తున్నట్టు బీసీసీఐ తన ట్వీట్‌లో పేర్కొంది. కేఎల్ రాహుల్, మయాంక్, నవదీప్ ఈ ముగ్గురు ఆటగాళ్లలో ఎవరు రెండో వన్డేలో ఆడుతారనే దానిపై సందిగ్ధం నెలకొంది.


 


కాగా, తొలి వన్డేలో విరాట్ కోహ్లీ నుంచి క్యాప్ అందుకున్న బ్యాటర్ దీపక్ హుడా టీమ్ ఇండియా జట్టులో అరంగేట్రం చేశాడు. తొలి వన్డేలో స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ (4/49) అద్భుతంగా రాణించడంతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ ఆరు వికెట్ల తేడాతో వెస్టిండీస్‌పై ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. 1000 మ్యాచులో కెప్టెన్ రోహిత్ శర్మ 50 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. సూర్యకుమార్ యాదవ్ (34), దీపక్ హుడా (26) కూడా తమవంతు సహకారం అందించి జట్టును విజయతీరాలకు చేర్చారు. వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్ 1-0 ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది.


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa