ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖపట్నం జిల్లాలో దారుణం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 08, 2022, 04:53 PM

భోజనంలో కూర లేదని కన్నతల్లినే కడతేర్చాడో కసాయి కొడుకు. అత్యంత కర్కశంగా గొడ్డలితో తలపై మోది హతమార్చాడు. ఈ విషాదకర ఘటన విశాఖపట్నం జిల్లాలోని జి.మాడుగు ఏజెన్సీలో చోటు చేసుకు౦ది. ఈ ఘటనపై జి.మాడుగుల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకెళితే.. విశాఖ మన్యంలోని జి.మాడుగుల మండలం వంతాల పంచాయతీ అడ్డులలో రేగం రామన్నదొర, అర్జులమ్మ(60) దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. చిన్న కుమారుడు మత్స్యలింగం(35) ఆదివారం అర్ధరాత్రి అధికంగా మద్యం తాగి ఇంటికి వచ్చాడు. తల్లి అర్జులమ్మను నిద్రలేపి భోజనం పెట్టమన్నాడు. అన్నంతో చారు మాత్రమే ఉండటంతో కూర కావాలని అడిగాడు. కూర ఇంట్లో లేదని తల్లి చెప్పడంతో ఆమెపై ఆగ్రహించి చేయి చేసుకున్నాడు. తండ్రి కలుగజేసుకొని కుమారుడిని వారించాడు. ఆయనతోనూ వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో తల్లి, తండ్రి, కుమారుడి మధ్య తోపులాట జరిగింది. పెద్ద కుమారుడిని తీసుకొస్తానని చెప్పి తండ్రి బయటకు వెళ్లాడు. ఆ సమయంలో తల్లి తలపై మత్స్యలింగం గొడ్డలితో మోదాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి భర్త రామన్నదొర ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సోమవారం గ్రామాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa