ప్రకాశం బ్యారేజి కృష్ణా-గుంటూరు జిల్లాలలను అనుసంధానం చేస్తూ నిర్మించబడింది. మంగళగిరి- విజయవాడ నగరాల ప్రజల రాకపోకలకు ఎంతో సౌకర్యం గా ఉండేది. జిల్లాలో ఇతర ప్రాంతాలతో పాటు మంగళగిరి నుండి వర్తక వ్యాపారాలు నిర్వహించే వారు, ఇతర పనుల నిమిత్తం వెళ్లేవారు అధిక సంఖ్యలో ఉన్నారు. ఇక చరిత్ర విషయానికి వస్తే ఈస్ట్ ఇండియా పాలనలో 1852 లో కృష్ణా-గుంటూరు జిల్లాలను అనుసంధానం చేస్తూ కృష్ణానది పై సర్ ఆర్థర్ కాటన్ 1853 నాటికి కృష్ణానది పై ఆనకట్టను నిర్మించారు. కాల క్రమేణా 1957 డిసెంబర్ 24 నాటికి ప్రస్తుతం ఉన్న ప్రకాశం బ్యారేజీ నిర్మాణం పూర్తి అయ్యి ప్రస్తుతం ఉన్న బ్యారేజీ ప్రయాణీకుల రాకపోకలకు సిద్దమయ్యింది నాటి నుండి సుమారు 30-35 ఏళ్లకు పైగా ప్రయాణీకులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇది ఉపయోగంలో ఉంది. ఆ తరువాత ప్రకాశం బ్యారేజీ పటిష్టత లోపించి 1990 వ దశకంలో భారీ వాహనాలు రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీని కారణంగా అంతకుముందు ప్రయాణీకులు ఆర్టీసీ బస్సుల ద్వారా ప్రకాశం బ్యారేజీ పై రాక పోకలు సాగించేవారు. అతి తక్కువ ఛార్జీతో రెండు జిల్లాల పరిధిలో తమ గమ్య స్థానాలకు చేరుకునేవారు.
ఇప్పుడు సుమారు రెండు దశాబ్దాలుగా ఆటోలను ఆశ్రయించి రెండు జిల్లాల ప్రజలు ప్రయాణం కొనసాగిస్తున్నారు. ఇలా ప్రయాణించే ప్రయాణీకుల సంఖ్య వేలల్లో ఉంది. మంగళగిరి నుండి విజయవాడ, విజయవాడ నుండి మంగళగిరి ఈ రెండు నగరాల మధ్య నిత్యం ప్రయాణించే ప్రయాణీకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీ పై మినీ బస్సులు ఏర్పాటు చేయాలని ఈ రెండు జిల్లాల ప్రజలు 20 ఏళ్లుగా కోరుతున్నారు. అప్పట్లో ప్రజా సంఘాల వారు కూడా మినీ బస్సులు ఏర్పాటు చేయాలని ఉద్యమాలు చేశారు. అయితే ఏ ప్రభుత్వం దీనికి శ్రీకారం చుట్టలేదు. చేసేది లేక అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రకాశం బ్యారేజీ పై ప్రయాణ సౌకర్యార్థం కేవలం ఆటోలను ప్రయాణీకులు ఆశ్రయిస్తున్నారు. ఆటోలు తప్ప ప్రకాశం బ్యారేజీ పై ప్రయాణానికి ప్రత్యామ్నాయ మార్గం లేదు. దీనితో ఆటోలద్వారా రెండు జిల్లాల పరిధిలో ప్రయాణించే విషయంలో ప్రయాణీకులు అభద్రతా భావం తో పాటు ఆర్ధిక దోపిడికి పెద్ద స్థాయిలో గురవుతున్నారు.
ఆటోలు మాత్రమే తప్పనిసరి పరిస్థితిలో ప్రయాణ సాధనాలుగా ఉన్నాయని దీనిని ఆసరాగా చేసుకున్న ఆటో డ్రైవర్లు వల్ల ఆర్ధిక దోపిడీకి గురవుతున్నామని, పైగా ఆటో ప్రయాణ అంటే కొంత అభద్రతా భావంతో ఆటోల్లో ప్రయాణం తప్పనిసరి అయ్యింది అని రెండు జిల్లాల వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మంగళగిరి-విజయవాడ మధ్య ప్రయాణంతో జేబులు గుల్ల అయిపోతున్నాయని ఎంతో మంది ప్రయాణీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగళగిరి నుండి విజయవాడ మార్కెట్ కు 10 కిలో మీటర్లు దూరం ఆటోల్లో ప్రయాణించాలి అంటే ఆటో ఛార్జి 30 రూపాయలు వసూలు చేస్తున్నారు. అదే మంగళగిరి నుండి గుంటూరు బస్ స్టాండ్ కు 20 కిలోమీటర్ల కు ఆటో ఛార్జ్ 30 రూపాయలు 20 కిలోమీటర్ల కు 10 కిలోమీటర్ల కు ఒకటే ఛార్జీనా అని ప్రయాణికులు వాపోతున్నారు. అలాగే కోవిడ్ ను ఆసరాగా చేసుకుని మంగళగిరి-విజయవాడ మధ్య ప్రయాణించే ప్రయాణీకుల వద్ద ఆటో డ్రైవర్లు ఛార్జి రూ. 50 వసూలు చేశారు.
అందుకే మంగళగిరి-విజయవాడ మధ్య మినీ బస్సులు ఎంతో అవసరం ఉందని పలువురు ప్రయాణికులు కోరుతున్నారు. సురక్షిత ప్రయాణానికి ఆర్టీసీ బస్సు మేలు అని చెప్పే ప్రభుత్వం ప్రకాశం బ్యారేజీపై మినీ బస్సులు తిప్పేందుకు చర్యలు తీసుకోవాలని, ప్రకాశం బ్యారేజీ మీదుగా ప్రయాణించే వారు ఆటోల ఆర్ధిక దోపిడీకి గురికాకుండా, అభద్రతాభావంతో కూడిన ప్రయాణానికి లోను కాకుండా ఉండాలంటే ప్రకాశం బ్యారేజీ పై మినీ బస్సుల అవసరం ఉందని భావిస్తున్నారు. పాలకులు, ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించి మంగళగిరి-విజయవాడ మధ్య మినీ బస్సులు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa