రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య నెలకొన్న యుద్దంతో ఎలక్ట్రికల్ వస్తువులకు రెక్కలు వచ్చేస్తున్నాయి. ఏ వస్తువు కొనాలన్నా గుండె బరువెక్కే పరిస్థితి నెలకొంది. ఉక్రెయిన్పై రష్యా జరుపుతోన్న దాడికి ప్రతిఫలంగా ప్రపంచమంతా ధరలు పెరుగుతాయని అల్లాడిపోతుంది. ద్రవ్యోల్బణాలు కొండెక్కితే.. సామాన్యుల పరిస్థితి ఏమిటని ఆర్థిక వేత్తలు, విశ్లేషకులు, ప్రభుత్వాలు ఆందోళన చెందుతున్నాయి. కేవలం క్రూడాయిల్ ధరలు మాత్రమే కాక.. ఇప్పటికే మెటల్స్, మినరల్స్ ధరలు ఆకాశాన్నంటి కూర్చున్నాయి. దీంతో రాబోతున్న వేసవిలో రిఫ్రిజిరేటర్లు, వైట్ గూడ్స్, ఎయిర్ కండీషనర్లు, వాషింగ్ మెషిన్ల ధరలు మరింత పెరగనున్నట్టు తెలుస్తోంది. ఈ ఉత్పత్తుల తయారీలో స్టీల్, అల్యూమినియం వంటి మెటల్స్ను వాడతారు. ప్రస్తుతం లండన్ మెటల్ ఎక్స్చేంజ్లో అల్యూమినియం ధరలు గరిష్ట స్థాయిలకు ఎగిశాయి. 2008 ప్రారంభం నుంచి ఈ మెటల్ మరింత ఖరీదైనదిగా మారింది. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభ ప్రభావంతో పెట్రోల్, డీజిల్, బస్సు కారు ట్రావెల్, ఎల్పీజీ, కిరోసిన్, సోపు, బ్యూటీ ప్రొడక్టులు, పెయింట్స్, సింథటిక్ గార్మెంట్స్, స్కూటీ, ఫ్రిడ్జ్, ఏసీ, వాషింగ్ మెషిన్, టీవీ, ల్యాప్టాప్, మొబైల్ నుంచి ఇళ్ల ధరల వరకు ప్రతీది పెరగనుందని ఇప్పటికే పలు రిపోర్టులు హెచ్చరిస్తున్నాయి. వార్ ప్రభావంతో ముడి సరుకుల ధరలు పెరిగి, కంపెనీల ఇన్పుట్ ఖర్చులు పెరగనున్నాయని పేర్కొన్నాయి. ఈ ఖర్చుల ప్రభావాన్ని కంపెనీలు వినియోగదారులకు బదలాయించనున్నాయని తెలిపాయి. ఇప్పటికే కరోనా ఒమిక్రాన్ ప్రభావంతో కంపెనీల ప్రొడక్షన్ తగ్గింది. ఫిబ్రవరి నుంచే తమ ఉత్పత్తిని పెంచడం కంపెనీలు ప్రారంభించాయి. ప్రొడక్షన్తో పాటు ఇన్పుట్ ఖర్చులు పెరగడంతో.. ప్రస్తుతం కంపెనీల వద్ద ఎలాంటి ఆప్షన్ లేకుండా పోయింది. తప్పనిసరి పరిస్థితుల్లో ధరలను పెంచడం అనివార్యమైంది. ద్రవ్యోల్బణ ప్రభావంతో 2020 నుంచి కంపెనీలు మూడు సార్లు ధరలు పెంచాయి. రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, వాషింగ్ మెషిన్ల ధరలు సగటున 15 శాతం నుంచి 35 శాతానికి ధరలు పెంచాయి. కాగా, పెరుగుతోన్న ఇంధన ధరలు, ద్రవ్యోల్బణం పెరిగేందుకు మరింత సహకరించనున్నాయి. ద్రవ్యోల్బణం పెరిగితే.. వైట్ గూడ్స్ ధరలు కూడా పెరుగుతాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa