ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డైవర్స్ కేసులో హైకోర్టు సంచలన తీర్పు

national |  Suryaa Desk  | Published : Thu, Mar 31, 2022, 07:04 PM

భార్యాభర్తలు వీడిపోయిన సందర్భంలో భార్యకు భర్త భరణం ఇవ్వటం చాలా ఏళ్ల నుంచి వస్తున్న పద్ధతి. అయితే వీడాకులు తీసుకునే భార్య తన భర్తకు భరణం ఇవ్వాలని బొంబాయి​ హైకోర్టు ఔరంగాబాద్ తీర్పు చెప్పింది. మహారాష్ట్రలోని నాందేడ్​ సివిల్​ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. సివిల్​ కోర్టు తీర్పును సవాల్​ చేస్తూ వేసిన పిటిషన్​ను కొట్టివేసింది.
1992లో ఓ జంటకు వివాహం జరిగింది. కుటుంబ కలహాలతో భర్త నుంచి విడాకులు ఇప్పించాలని 2015లో భార్య నాందేడ్​ సివిల్​ కోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టిన కోర్టు వారికి అదే ఏడాది విడాకులు మంజూరు చేసింది. హిందూ వివాహ చట్టం 1955లోని సెక్షన్​ 24, 25 ప్రకారం భార్య నుంచి శాశ్వత భరణం, జీవనాధార ఖర్చులు ఇప్పించాలని కోరుతూ ఆమె భర్త పిటిషన్​ వేశారు. తనకు జీవనాధారం ఏమీ లేదని, భార్య ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ మంచి వేతనం తీసుకుంటున్నట్లు పిటిషన్​లో పేర్కొన్నారు. భర్త పిటిషన్​ను విచారణకు స్వీకరించిన నాందేడ్​ సివిల్​ కోర్టు భరణం ఇవ్వాలని భార్యను ఆదేశించింది. దీంతో ఆమె నాందేడ్​ సివిల్​ కోర్టు తీర్పును సవాల్​ చేస్తూ ఔరంగాబాద్​ హైకోర్టును ఆశ్రయించింది.
ఔరంగాబాద్​ హైకోర్టులో విచారణ సందర్భంగా విడాకులు మంజూరయ్యాక వారి బంధం ముగిసిపోయిందని, ఎలాంటి భరణం ఇవ్వాల్సిన అవసరం లేదని పిటిషనర్​ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే హిందూ వివాహ చట్టంలోని సెక్షన్​ 25 ప్రకారం ఎప్పుడైనా భరణం కోరుతూ పిటిషన్​ వేయవచ్చని భర్త తరఫు న్యాయవాది అన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు భర్తకు భార్య భరణం ఇవ్వాలని తీర్పు వెల్లడించింది.
సివిల్​ కోర్టులో వాదనలు, సమర్పించిన డాక్యుమెంట్లు, గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును పరిశీలించిన హైకోర్టు సివిల్​ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. భర్తకు భరణం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa