ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరుసగా రెండో మ్యాచ్ లోనూ...రాజస్థాన్ రాయల్స్ జోరు

sports |  Suryaa Desk  | Published : Sat, Apr 02, 2022, 11:53 PM

ఐపీఎల్ లో ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ జోరు హవా జోరుగా సాగుతోంది. వరుసగా రెండో మ్యాచ్ లోనూ జయభేరి మోగించింది. ముంబయి డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ 23 పరుగులతో ముంబయి ఇండియన్స్ ను ఓడించింది. కీరన్ పొలార్డ్ క్రీజులో ఉండడంతో ఓ దశలో ముంబయి విజయం సాధ్యమే అనిపించినా, సాధించాల్సిన రన్ రేట్ భారీగా ఉండడంతో నిరాశ తప్పలేదు. చివరి ఓవర్ వేసిన నవదీప్ సైనీ అద్భుతంగా బంతులు వేసి పొలార్డ్ ను కట్టడి చేశాడు. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 193 పరుగులు చేసింది. ఆపై 194 పరుగుల లక్ష్యఛేదనలో ముంబయి జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 170 పరుగులు చేసింది. 22 పరుగులు చేసిన పొలార్డ్ ఇన్నింగ్స్ చివరి బంతికి అవుటయ్యాడు.  అంతకుముందు ముంబయి ఓపెనర్ ఇషాన్ కిషన్ 54 పరుగులు చేయగా, మరో యువ ఆటగాడు తిలక్ వర్మ 33 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సులతో 61 పరుగులు చేసి ముంబయి విజయంపై ఆశలు కల్పించాడు. అయితే అశ్విన్ బౌలింగ్ లో తిలక్ వర్మ అవుట్ కావడంతో ముంబయి ఆశలు సన్నగిల్లాయి. ఆదుకుంటారనుకున్న టిమ్ డేవిడ్ (1), డానియల్ సామ్స్ (0) నిరాశపర్చారు. రాజస్థాన్ బౌలర్లలో నవదీప్ సైనీ 2, చహల్ 2, ట్రెంట్ బౌల్ట్ 1, ప్రసిద్ధ్ కృష్ణ 1, రవిచంద్రన్ అశ్విన్ 1 వికెట్ తీశారు. ఇదిలావుంటే ముంబయి జట్టుకు ఇది వరుసగా రెండో ఓటమి. సొంతగడ్డపై ఆడుతున్నప్పటికీ ఆ జట్టు తడబాటుకు గురికావడం టీమ్ మేనేజ్ మెంట్ ను ఆందోళనకు గురిచేస్తోంది. ఇదిలావుంటే ఐపీఎల్ లో ఇవాళ్టి రెండో మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ సంఘం స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. ఈ పోరులో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం 2 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ జట్టు 1 వికెట్ నష్టానికి 14 పరుగులు చేసింది. క్రీజులో శుభ్ మాన్ గిల్, విజయ్ శంకర్ ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa