ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాకు కనీసం పిలుపు లేకపోయే: దాడి వీరభద్రరావు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 05, 2022, 01:36 PM

సొంత పార్టీ పై వైసీపీ నేత దాడి వీరభద్రరావు అలిగారు. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 26 జిల్లాలను ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారికంగా ప్రకటించడంతో ఈ అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే, పలుచోట్ల అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే లుకలుకలు వినిపిస్తున్నాయి. తాజాగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దాడి వీరభద్రరావు సొంత పార్టీపై విమర్శలు చేశారు. జిల్లాల ఏర్పాటుపై ఇంత పెద్ద కార్యక్రమం జరిగితే.. తనకు కనీసం ఆహ్వానం అందలేదని మనస్తాపం చెందారు. జిల్లాల ఏర్పాటుకు సంబంధించి తనకు కనీసం సమాచారం లేదని దాడి వీరభద్రరావు అన్నారు. పార్టీ నుంచి కానీ, ప్రభుత్వం నుంచి పిలుపు లేదని.. టీవీలో సీఎం జగన్మోహన్ రెడ్డి మొహం చూసి ప్రసంగం విని ఆనందించానని చెప్పుకొచ్చారు. వైసీపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న తనకు కనీసం ఆహ్వానం కూడా రాలేదని దాడి వీరభద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో కనీసం ప్రాతినిధ్యం కూడా లేదని వాపోయారు. అయితే, తమను ఎవరు కాలు పెట్టి తోసేసినా పార్టీని గౌరవిస్తానని చెప్పారు. ఎన్ని అవమానాలు ఎదురైనా జగన్ ఆశయాల కోసం పని చేస్తానని వెల్లడించారు. ఇక, అనకాపల్లి జిల్లా ఏర్పడిననందుకు సంతోషంగా ఉందని దాడి వీరభద్రరావు అన్నారు. పార్టీ పదవుల్లో ఉన్న వారిని భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉందన్నారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ప్రభుత్వ భూముల రికార్డులు మార్చేశారని, రెవెన్యూ అధికారులు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా మారిపోయారని ఆరోపించారు. అలాగే, ఆంధ్రప్రదేశ్‌లో అక్రమాలు జరుగుతున్నాయని దాడి వీరభద్రరావు తీవ్ర ఆరోపణలు చేశారు. విశాఖపట్నంలో ప్రభుత్వ భూములు కబ్జాలకు గురవుతున్నాయని వ్యాఖ్యానించారు. పోలీసులు, కబ్జాదారులు, తహశీల్దార్లు కుమ్మక్కైపోయారని.. సీఎం జగన్ దీన్ని చెక్ చేసుకోవాలని దాడి సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa