ఈక్వెడార్ జైల్లో మరోసారి ఖైదీల మధ్య ఘర్షణ జరిగింది. రెండు గ్యాంగ్లు ఒకరిపై మరొకరు తుపాకులు, కత్తులతో దాడి చేసుకున్నాయి. ఈ దాడుల్లో 20 మంది చనిపోయారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలైనట్టు ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి ప్యాట్రికో కార్రిల్లో వెల్లడించారు. రాజధాని క్విటోకు దక్షిణంగా 190 మైళ్ల దూరంలో ఉన్న టురీలోని జైల్లో ఈ ఘర్షణ చోటుచేసుకుంది. ప్రస్తుతం జైల్లో ప్రశాంత వాతావరణం నెలకొన్నట్టు ఆయన వెల్లడించారు.
అలాగే ఈ గొడవను అదుపు చేయడానికి వెయ్యి మంది పోలీసులను, మిలట్రీ సిబ్బంది పని చేసినట్టు కార్రిల్లో చెప్పారు. గొడవల నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశామని, జైల్లోని ప్రతి బ్లాక్ను తనిఖీలు చేసినట్టు అధికారులు చెప్పారు. ఈ గొడవలకు సంబంధించిన లోకల్ మీడియాలో ఓ వీడియోను ప్రసారం చేయగా అందులో తుపాకీల కాల్పుల శబ్దాలు వినిపించాయి. అయితే ఈ ఘర్షణలకు రాజకీయాలకు సంబంధం ఉన్నట్టుగా అధికారులు అనుమానిస్తున్నారు.
ఈక్వెడార్లోని జైల్లో ఈ విధంగా హింసాత్మక ఘటనలు జరగడం ఇదేమి కొత్త కాదు. అక్కడ తరచుగా జరుగుతూనే ఉంటాయి. అక్కడ జైళ్లలో రక్తపుటేర్లు పారుతూనే ఉంటాయి. ఇలాంటి సంఘటనలకు సంబంధించి గతంలో చాలా వీడియోలు బయటకొచ్చాయి. ఇక్కడ జైళ్లలో జరిగిన ఘర్షణలతో ఇప్పటికే 316 మంది ఖైదీలు చనిపోయినట్టు, అందులో 119 మంది గత ఏడాది సెప్టెంబర్లో జరిగిన అల్లర్లలోనే చనిపోయినట్టు అమ్నెస్టీ ఇంటర్నేషనల్ వెల్లడించింది.
గత ఏడాది ఫిబ్రవరిలో కూడా మూడు జైళ్లలో అల్లర్లు జరిగాయి. డ్రగ్స్ వ్యాపార ముఠాల మధ్య జరిగిన ఈ గొడవల్లో దాదాపుగా 75 మంది ఖైదీలు మరణించారు. ఈ ఘర్షణల్లో కొందరి తలలను, కొందరు ఖైదీలు కాళ్లను, కొందరి చేతుల్ని నరికేశారు. అంత తీవ్రస్థాయిలో హింస జరగడం ఆ దేశ చరిత్రలోనే మొదటిసారి. ఈ హింసాత్మక ఘటనలకు సంబంధించి వీడియోలు బయటకు రావడంతో అక్కడి జైలు వ్యవస్థపై అనేక విమర్శలు వెల్లువెత్తాయి.
అక్కడ డ్రగ్స్ గ్యాంగ్లు జైళ్లపై ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తుంటాయి. ఇందులో భాగంగా ఇలాంటి అల్లర్లు జరగడం పరిపాటిగా మారింది. ఈక్వెడార్లో చాలా పేదరిక దేశం. దాంతో అక్కడ మాదకద్రవ్యాల వ్యాపారం విచ్చలవిడిగా సాగుతోంది. ప్రపంచ స్థాయిలో డ్రగ్స్ వ్యాపారం చేసే ముఠాలు అక్కడ ఉన్నాయి. అయితే దేశంలో డ్రగ్స్ వ్యాపారాన్ని అదుపు చేయాలని, జైళ్ల వ్యవస్థను సంస్కరించాలని ప్రజాస్వామిక వాదులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం ఆ దిశగా ఏమి చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa