ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇమ్రాన్ కాన్ సన్నిహితులు...ఒక్కోక్కరుగా విదేశాలకు జంప్

international |  Suryaa Desk  | Published : Thu, Apr 07, 2022, 01:51 PM

రాజకీయ సంక్షోభం నేపథ్యంలో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పదవి నుంచి దిగిపోవడంతో ఆయన సన్నిహితులకు అరెస్ట్‌ల భయం పట్టకుంది. ఇమ్రాన్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని అందినంత దోచుకున్న వీరంతా దేశం విడిచి వెళ్లేందుకు సిద్ధమయ్యారని కథనాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే ఇమ్రాన్ ఖాన్ మూడో భార్య బుష్రా బీబీ అనుంగు స్నేహితురాలు ఫరాఖాన్ దుబాయ్‌కు పారిపోయినట్టు ఎక్స్‌ప్రెస్ ట్రైబ్యూన్ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. ఆమె భర్త అషాన్ జమిల్ గుజ్జర్ కూడా అమెరికాకు పరారయ్యాడు. అధికారుల కోరుకున్న చోటుకు బదిలీలు, పోస్టింగ్‌ల కోసం సహకరించిన ఫరాఖాన్.. పెద్దమొత్తంలో వారి నుంచి డబ్బులు వసూలుచేసినట్టు విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ కుంభకోణాన్ని ‘మదర్‌ ఆఫ్ ఆల్ స్కాండల్స్‌’‌గా అభివర్ణిస్తున్న ప్రతిపక్షాలు.. దీని విలువ 6 బిలియన్ల పాకిస్థానీ రూపాయలు( 32 మిలియన్ల అమెరికన్ డాలర్లు) ఉంటుందని దుయ్యబడుతున్నాయి.


ఇమ్రాన్‌ ఖాన్, ఆయన భార్య ప్రోద్భలంతో ఫరాఖాన్ ఈ అవినీతికి పాల్పడ్డారని పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌ ఉపాధ్యక్షురాలు, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె మరియమ్ నవాజ్ ధ్వజమెత్తారు. ఒకసారి పదవి నుంచి దిగిపోతే తన అవినీతి బాగోతం బయటపడుతుందని ఇమ్రాన్ భయపడుతున్నారని ఆరోపించారు. అంతేకాదు, ఫరాఖాన్ 90 వేల డాలర్లను తన హ్యాండ్‌ బ్యాగులో తీసుకెళ్లారని మాజీ ఆర్థిక మంత్రి మిఫ్తా ఇస్మాయిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్‌కు పదవి లేకపోవడంతో ఫరాఖాన్ వంటి ఆయన సన్నిహితులు పాక్ విడిచి పారిపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇటీవల పంజాబ్ గవర్నర్ పదవి నుంచి తొలగించిన చౌధురీ సర్వార్, ఇమ్రాన్ పాత మిత్రుడు అలీమ్ ఖాన్ సైతం ఈ రకమైన ఆరోపణలు చేశారు. పంజాబ్‌లో ముఖ్యమంత్రి ఉస్మాన్ బుజాదర్ ద్వారా బదిలీలు, పోస్టింగుల కోసం ఫరాఖాన్ కోట్లాది రూపాయాలు దండుకున్నారని దుయ్యబట్టారు. ఇమ్రాన్‌ ఖాన్‌‌కు వ్యతిరేకంగా విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని డిప్యూటీ స్పీకర్ తిరస్కరించిన నిమిషాల్లోనే జాతీయ అసెంబ్లీని రద్దు చేయాలని కోరుతూ అధ్యక్షుడికి పాక్ ప్రధాని సిఫార్సు చేయడం చకచకా జరిగిపోయాయి. అసెంబ్లీకి రాకుండానే ఇమ్రాన్ ఖాన్ విపక్షాలకు ఝలక్ ఇచ్చారు. దీంతో విపక్షాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దేశంలో తలెత్తిన రాజకీయ సంక్షోభం అంశాన్ని అక్కడి సుప్రీంకోర్టు కూడా సుమోటాగా స్వీకరించింది. పార్లమెంట్ రద్దుతో ఎన్నికలు అనివార్యం కాగా.. మూడు నెలల్లో నిర్వహణ సాధ్యం కాదని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఎన్నికల ప్రక్రియకు కనీసం ఆరు నెలల సమయం పడుతుందని ఓ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa