ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కెనడాలో జాంబీ డిసీజ్....భయంతో వణికిపోతున్న ప్రజలు

international |  Suryaa Desk  | Published : Thu, Apr 07, 2022, 04:07 PM

కరోనా వైరస్ ఎలా వ్యాపించిందన్న చర్చ నేపథ్యంలో ప్రస్తుతం కెనడాలో జింకలకు సోకిన వ్యాధితో మరోమారు అక్కడి ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. కెనడాలో జింకలను వింత ‘జాంబీ’ వ్యాధి పీడిస్తోంది. చాలా వేగంగా సంక్రమిస్తోంది. ‘ద క్రానిక్ వేస్టింగ్ డిసీజ్ (సీడబ్ల్యూడీ)’గా పిలుస్తున్న ఆ వ్యాధి ఇప్పటికే ఆల్బర్టా, సాస్కాషెవాన్ రాష్ట్రాలకు వ్యాపించిందని ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. మెదడుకు సంబంధించిన ఈ వ్యాధి జింకల జాతుల్లోని జింకలు, దుప్పులు, కస్తూరి జింకలు, మూజ్ వంటి వాటికి సంక్రమిస్తుందని అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) అధికారులు స్పష్టం చేశారు. వాటి నుంచి మనుషులకూ సంక్రమిస్తుందంటున్నారు. ఇది ప్రాణాంతకమని, అది సోకితే ప్రాణాలు పోవడం ఖాయమని అన్నారు. వ్యాక్సిన్లు గానీ, చికిత్స గానీ లేదని చెప్పారు. వాస్తవానికి 1960ల్లోనే ఈ వ్యాధిని అమెరికాలో గుర్తించారు. కొలరాడో, ఓక్లహామా, కాన్సాస్, నెబ్రాస్కా, మినెసోటా, విస్కాన్సిన్, సౌత్ డకోటా, మోంటానాల్లో వ్యాధి విస్తరించింది. ప్రస్తుతం అమెరికాలోని 26 రాష్ట్రాల్లో సీడబ్ల్యూడీ జాడలున్నాయి. కెనడాలో 1996లో సాస్కాషెవాన్ లో జింకలో తొలి కేసు నమోదైంది. 


మనుషులకు సోకుతుందా?


అమెరికా సీడీసీ ప్రకారం జింకల నుంచి మనుషులకు ఈ వ్యాధి సోకుతుంది. అది కూడా చాలా వేగంగా సంక్రమించే ముప్పుంది. జింక మాంసం తిన్నా.. లేదా దానిని వేటాడినా.. ముట్టుకున్నా వ్యాధి అంటుకుంటుంది. ప్రత్యేకించి జింకల వేటగాళ్లకు ముప్పు ఎక్కువగా ఉంటుంది. 


ప్రమాదమేనా? 


ఈ వ్యాధితో ప్రమాదమేనని సీడీసీ చెబుతోంది. ఇన్ ఫెక్షన్ సోకిన జింక మాంసంలోని ప్రియాన్ ప్రొటీన్.. ఉడికించినా బ్రేక్ డౌన్ కాదని, కాబట్టి మాంసంలో ఆ వైరస్ అలాగే ఉంటుందని చెబుతోంది. కాబట్టి సీడబ్ల్యూడీ ఇన్ ఫెక్షన్ సోకిన జింకల మాంసాన్ని వండుకుని తిన్నా వ్యాధి సోకుతుందని హెచ్చరిస్తోంది. అయితే, ఇప్పటిదాకా ఆ వ్యాధి మనుషులకు సోకిన దాఖలాలు చాలా తక్కువని అంటోంది.  కాబట్టి జింకల వేటను తగ్గించాలని, జింక మాంసం తినరాదని, జింక మాంసాన్ని ప్రాసెస్ చేసేటప్పుడు జాగ్రతగ్గా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. జింక మాంసాన్ని డ్రెస్సింగ్ చేసేందుకు కిచెన్ చాకులు వాడొద్దని చెబుతున్నారు. 


జాంబీ డిసీజ్?


సీడబ్ల్యూడీ ఒకరకంగా ‘జాంబీ’ డిసీజేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సీడబ్ల్యూడీ సోకిన జింకల మైండ్ అదుపుతప్పుతుందని అంటున్నారు. ఎక్కువగా సొంగ/జొల్లు కారడం, చుట్టూ ఏం జరుగుతోందో గుర్తించలేకపోవడం, ఎక్కువగా మూత్రం పోయడం, బరువు తగ్గడం, భిన్నమైన ప్రతిస్పందనలు వంటివి వైరస్ సోకిన జింకల లక్షణాలని చెబుతున్నారు. మూత్రం, వాటి జొల్లు ద్వారా కూడా వైరస్ వ్యాప్తి జరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa