ఇటీవల కోర్టు ఓ ఆసక్తికర తీర్పును ఇచ్చింది. యావజ్జీవిత శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీకీ పిల్లలు కనేందుకు రాజస్థాన్ హైకోర్టు 15 రోజుల పెరోల్ మంజూరు చేస్తూ సంచలన ఉత్తర్వులు జారీచేసింది. రాజస్థాన్కు చెందిన నందన్ లాల్ అనే వ్యక్తి ఓ కేసులో జీవిత ఖైదు ఖరారు కాగా.. ప్రస్తుతం అతడు అజ్మీర్ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. తొలుత నందన్ లాల్ తనకు రెండు వారాల పాటు పెరోల్ మంజూరు చేయాలని అజ్మీర్ జిల్లా కమిటీకి పిటిషన్ సమర్పించారు. అయితే, ఆ విజ్ఞాపనను జిల్లా కమిటీ తోసిపుచ్చింది.
దీంతో లాల్ భార్య రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించింది. తన వైవాహిక జీవితంలో లైంగిక, భావోద్వేగ అవసరాలు తీరడం సహ భర్త ద్వారా పిల్లల్ని కనడానికి 15 రోజుల పెరోల్ ఇవ్వాలని ఆమె అభ్యర్థించింది. దీనిపై జస్టిస్ ఫర్జాంద్ అలీ, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది. చివరకు నంద్ లాల్కు కోర్టు పెరోల్ను మంజూరు చేసింది. ఇక, పెరోల్ మంజూరుపై నిర్ణయం తీసుకునే క్రమంలో వివిధ మత గ్రంథాలు న్యాయమూర్తులు పరిశీలించారు.
సామాజిక, మానవతా అంశాలతోపాటు సంతానం దంపతుల ప్రాథమిక హక్కు అంటూ జీవిత ఖైదీకి పెరోల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. వైవాహిక జీవితంతో ముడిపడి ఉన్న భార్య లైంగిక, భావోద్వేగ అవసరాలను తప్పనిసరిగా రక్షించాల్సిన అవసరం ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘‘తమ వైవాహిక జీవితంలో ఎటువంటి సమస్యలు లేవని, నాకు పిల్లలు లేరు కాబట్టి సంతానం కోసం తన భర్తకు 15 రోజుల ఎమర్జెన్సీ పెరోల్ ఇవ్వండి’’ సదరు భార్య పెరోల్ దరఖాస్తులో కోరింది.
ఈ అంశాన్ని న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది. ‘‘వివాహం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ జంటకు ఎటువంటి సమస్య లేదు.. వంశ పరిరక్షణ కోసం సంతానం అవసరమని మత ఆచారాలు, భారతీయ సంస్కృతి, వివిధ న్యాయపరమైన అంశాల ఆధారంగా గుర్తించాం’ అని కోర్టు పేర్కొంది. ‘‘భర్త ఖైదీగా ఉండటం భార్య సంతానం పొందే హక్కును కోల్పోయింది.. అయితే ఆమె ఎటువంటి నేరం చేయలేదు.. కాబట్టి ఆమెకు శిక్ష వేయరాదు.. వివాహ బంధాన్ని నిరాకరించడం వల్ల పిల్లల్ని కనాలనే ఆమె హక్కులపై ప్రతికూల ప్రభావం చూపుతుంది’’ అని కోర్టు వ్యాఖ్యానించింది.
‘‘సంతానం పొందే హక్కు మత గ్రంథాలలో కూడా ఉంది. వివిధ వేదికలపై లభించే సాహిత్యంలో దీని గురించి పేర్కొన్నారు’’ అని చెప్పారు. ఈ సందర్భంగా హిందూ పురాణాలలో పితృరుణం గురించి న్యాయమూర్తులు ప్రస్తావించారు. సంతానానికి జన్మనివ్వడం ద్వారా మాత్రమే ఈ రుణాన్ని తీర్చుకోవచ్చని తెలిపారు. కాగా, రూ.25వేల చొప్పున రెండు పూచీకత్తులతో పాటు రూ.50 వేల వ్యక్తిగత బాండ్ను సమర్పించాలని లాల్ దంపతులను హైకోర్టు ఆదేశించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa