చేనేత పై విధించే జీఎస్టీని తగ్గించాలన్న డిమాండ్ కు తన మద్దతు ఉంటుందని కాంగ్రెస్ ఎంపీ శశిధరూర్ అన్నారు. హ్యాండ్లూమ్స్పై జీఎస్టీని తొలగించాలని డిమాండ్ చేస్తూ కొంతమంది లా విద్యార్థులతో, ఏపీ చేనేత బ్రాండ్ అంబాసిడర్, సినీ నటి పూనమ్ కౌర్ కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ను కలిశారు. ఈ మేరకు వారిని కలవడం చాలా ఆనందంగా ఉందని కాంగ్రెస్ నేత శశి థరూర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. వారిని కలసిన ఫోటోలను ట్విట్టర్లో షేర్ చేశారు. వారి డిమాండ్కు మద్దతునిస్తున్నట్టు ప్రకటించారు.
"చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ తొలగించాలని డిమాండ్ చేస్తున్న న్యాయ విద్యార్థుల బృందాన్ని, నటి పూనమ్కౌర్ను కలవడం ఆనందంగా ఉంది. వారి డిమాండ్కు నేను మద్దతు ఇస్తున్నాను. పరిశ్రమ సంక్షోభంలో ఉంది. చేనేత కార్మికులు తమ అవసరాలను తీర్చుకోలేరు. పైగా జీఎస్టీ వల్ల ఖర్చు పెరిగి వారిపై అదనపు భారం పడుతోంది." అంటూ ఆయన ట్వీట్ చేశారు. దీనిపై పూనమ్ కౌర్ కూడా స్పందించారు. ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ కామెంట్ పెట్టారు.
కాగా చేనేత వస్త్రాలకు అంబాసిడర్గా వ్యవహరిస్తున్న పూనమ్ కౌర్ గత కొన్నాళ్లుగా హ్యాండ్లూమ్పై జీఎస్టీని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. చేనేత... మన దేశ నిజమైన చరిత్ర అని, సంస్కృతి అని నేతన్నలను ఆదుకోవాలని ఎప్పటి నుంచో కోరతున్నారు. చేనేత వస్త్రాలపై జీఎస్టీని తీసివేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అదేవిధంగా చేనేత కార్మికులు ఆరోగ్య కార్డులు, వారికి పిల్లలకు ఉచిత విద్య కల్పించి.. చేనేత రంగాన్ని బలోపేతం చేయాలని కోరుతున్నారు.
గతంలో కూడా పూనమ్కౌర్ ఆకలివెతలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న చేనేత కార్మికులకు అండగా ఉండాలని, జీఎస్టీని పూర్తిగా ఎత్తివేయాలని ప్రధానిని కోరారు. ఎన్నో శతాబ్దాల నుంచి దేవాలయాల్లో పూజించే విగ్రహాలకు వస్త్రాలు నేస్తున్నది చేనేత కార్మికులనేనని, వారిని కాపాడుకోవడం మన బాధ్యత అని ఆమె ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. వారి పట్ల ప్రభుత్వం దయతో వ్యవహరించాలని పూనమ్ కౌర్ ఎప్పటి నుంచో అభ్యర్థిస్తున్నారు. ఇందులో భాగంగా ఆమె నాయకులను కూడా కలసి ఈ డిమాండ్ను ముందుకు తీసుకెళ్తున్నారు. దీనికోసం అందరి మద్దతును పొందుతున్నారు. ఇందులో శశి థరూర్ తమ మద్దుతును ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa