రాజస్థాన్ రాయల్స్ - లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య ఆదివారం నాటి మ్యాచ్ లో ఊహించని పరిణామం ఒకటి చోటు చేసుకుంది. రవిచంద్రన్ అశ్విన్ రిటైర్డ్ అవుట్ గా వెనుదిరిగాడు. ఐపీఎల్ చరిత్రలో ఇది తొలి రిటైర్డ్ అవుట్. లక్నో బౌలర్ల ధాటికి వికెట్లు చేజారిపోతున్న క్రమంలో ఆరో స్థానంలో రవిచంద్రన్ అశ్విన్ ప్రవేశించాడు. షిమ్రాన్ హెట్ మేయర్ తో కలసి 68 పరుగులు కీలక భాగస్వామ్యం ఏర్పాటుకు కారణమయ్యాడు. 23 బంతులను ఎదుర్కొన్న అశ్విన్ 28 పరుగులు చేశాడు. ఇందులో రెండు సిక్స్ లు కూడా ఉన్నాయి. ఆ సమయంలో అతడు రిటైర్డ్ అవుట్ గా ప్రకటించి వెనుదిరగగా.. రియాన్ పరాగ్ వచ్చి నాలుగు బంతుల్లో 8 పరుగులు చేసి అతడు కూడా అవుటయ్యాడు. ఆ తర్వాత బౌల్ట్ రెండు పరుగులు చేశాడు. కానీ హెట్ మేయర్ 36 బంతుల్లో 59 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
కానీ, ఇదంతా జట్టు వ్యూహంలో భాగమని స్పష్టమైపోయింది. రాయల్స్ కెప్టెన్ సంజు శామ్సన్ స్వయంగా దీన్ని ప్రకటించాడు. ‘‘ఈ నిర్ణయం రాజస్థాన్ రాయల్స్ ది. భిన్నంగా ప్రయత్నిస్తున్నాం. సీజన్ కు ముందే దీనిపై మాట్లాడాము. ఏదైనా సందర్భం ఎదురైతే దీన్ని (రిటైర్డ్ అవుట్) వినియోగించుకోవాలని ముందే నిర్ణయించుకున్నాం. ఇది జట్టు నిర్ణయం’’ అని శామ్సన్ చెప్పాడు. దీనిపై హెట్ మేయర్ మ్యాచ్ తర్వాత స్పందిస్తూ.. నాకు దీనిపై (అశ్విన్ రిటైర్డ్ అవుట్) ఐడియా లేదు. కానీ, అతడు అలసిపోయాడు. ఇది మంచి నిర్ణయమే. ఎందుకంటే చిన్నారి (రియాన్ పరాగ్) మా కోసం సిక్స్ కొట్టాడు’’ అని చెప్పాడు. అశ్విన్ అలసిపోయినట్టు గుర్తించి, ఆ సమయంలో ఒక్క బంతి కూడా వృథా పోకూడదన్న ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa