ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నింధితుడికి జై కొట్టి ఆహ్వానం పలకడమా: సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం

national |  Suryaa Desk  | Published : Wed, Apr 13, 2022, 01:52 AM

ఓ నిందితుడికి జై కొట్టి అతని సన్నిహితులు గ్రాండ్ గా ఆహ్వానం పలకడంపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. బెయిల్‌పై విడుదలైన అత్యాచారం కేసులో నిందితుడికి ఘనంగా స్వాగతం పలికి, అతడి మద్దతుదారులు సంబరాలు చేసుకోవడం పట్ల సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ విద్యార్థి సంఘం నేత.. అత్యాచారం కేసులో అరెస్టయి బెయిల్‌పై విడుదలైతే ‘అన్న తిరిగొచ్చాడు’ అని పోస్టర్లు వేసి ఘన స్వాగతం పలికారు. నిందితుడికి హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ బాధితురాలు సుప్రీంకోర్టును ఆశ్రయించింది.


పెళ్లి పేరుతో నిందితుడు వంచించాడని, పలుసార్లు అత్యాచారం చేసి, గర్భవతి చేశాడని యువతి ఆరోపించింది. అంతేకాదు, బలవంతంగా అబార్షన్ చేయించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. దీంతో బాధితురాలు అతడి బెయిల్‌ను రద్దుచేయాలని సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ‘‘అన్న తిరిగొచ్చాడని ఓ హోర్డింగ్ ఏర్పాటు చేశారు.. రేప్ కేసులో నిందితుడు బెయిల్‌పై వస్తే సంబరాలు చేసుకోవడమా?’’ అని ధర్మాసనంలో జస్టిస్ హిమా కోహ్లి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.


‘‘అన్న తిరిగి రావడం ఏంటి? .. ఈ ఒక్క వారం మీ అన్నను జాగ్రత్తగా ఉండమని చెప్పండి’’ నిందితుడి తరఫున న్యాయవాదికి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఘాటుగా చెప్పారు. నిందితుడు శుభాంగ్ గోంటియా బీజేపీ సైద్ధాంతిక గురువు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ విద్యార్థి విభాగం ఏబీవీపీ నేత. అతడి బెయిల్‌ను సవాల్ చేస్తూ పిటిషన్‌ దాఖలు చేసిన మహిళ.. ఈ పోస్టర్ల గురించి కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. దీంతో నిందితుడి బెయిల్‌ను ఎందుకు రద్దుచేయకూడదని? పేర్కొంటూ ధర్మాసనం నోటీసులు జారీచేసింది.


అలాగే, ఈ అంశంపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం స్పందన తెలియజేయాలని కోరింది. అత్యాచారం కేసులో నిందితుడైన శుభాంగ్ గోంటియాకు మధ్యప్రదేశ్ హైకోర్టు గత నవంబరులో బెయిల్ మంజూరు చేసింది. అయితే, ఈ కేసులో వాస్తవాలు, తీవ్రతను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని బాధిత మహిళ వాదించారు. ఒక ప్రైవేట్ వేడుకలో నిందితుడు తన మెడలో తాళికట్టి, నుదుట తిలకం దిద్దాడని, బహిరంగంగా తనను భార్యగా అంగీకరించడానికి నిరాకరించాడని సుప్రీంకోర్టుకు తెలిపింది.


తాను అతడి వల్ల గర్భం దాల్చితే బలవంతంగా అబార్షన్ చేయించాడని ఆరోపించింది. గతేడాది బాధిత యువతి జబల్‌పూర్ మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదయ్యింది. వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత గోంటియా పరారయ్యాడు. దీంతో జూన్ 2021లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి, నిందితుడి ఆచూకీ చెప్పినవారికి రూ.5 వేల నగదు రివార్డు పోలీసులు ప్రకటించారు. కొద్ది రోజుల తర్వాత నిందితుడ్ని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa