భారత దేశంలో రోజువారీ కోవిడ్ కేసులు తగ్గడంతో ఆంక్షలు, నిబంధనలను ప్రభుత్వం ఎత్తి వేసింది. ఈ తరుణంలో ఢిల్లీలో అధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతుండడం ప్రజల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. ఇదే కొనసాగితే కోవిడ్ ఫోర్త్ వేవ్ రావొచ్చనే అనుమానాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. గత 24 గంటల్లో దేశంలో 975 కరోనా కొత్త కేసులు వెలుగు చూశాయి. ముందు రోజు కొత్త కేసుల సంఖ్య 949గా ఉంది. గత 24 గంటల వ్యవధిలో 796 మంది కరోనా నుంచి కోలుకోగా, నలుగురు మృతి చెందారు. దేశంలో ప్రస్తుతం 11,366 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ముందు రోజుతో పోలిస్తే యాక్టివ్ కేసుల సంఖ్య మరో 175 పెరిగింది. తాజాగా దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కరోనా కేసుల్లో ఢిల్లీ నుంచి వచ్చినవే 366 ఉన్నాయి. అక్కడ పాజిటివిటీ రేటు 3.95కు చేరింది. ఈ తరహా కేసుల పెరుగుదల ఫోర్త్ వేవ్ హెచ్చరికలను పంపుతోంది. నిబంధనలు ఎత్తి వేసినా, ప్రజలంతా మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని నిపుణులు సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa