ఆధునికంగా సమాజం వేగంగా ముందుకెళ్తున్నా ఇంకా ప్రజల్లో మూడ విశ్వాసాలు వీడటంలేదు. కొన్ని దేవాలయాల్లో విచిత్రమైన ఆచారాలు పాటిస్తుంటారు. కర్నూలు జిల్లాలోని సిద్ధరామేశ్వరస్వామి పుణ్యక్షేత్రంలోనూ ఇలాంటి సంప్రదాయాలే అమల్లో ఉన్నాయి. ఆలూరు నియోజకవర్గంలోని చిన్నహోతూరులో ఈ ఆలయం ఉంది. ఇక్కడ ఏటా ఏప్రిల్ మాసంలో స్వామివారికి అత్యంత ఘనంగా రథోత్సవాలు నిర్వహిస్తారు.
ఉత్సవాల ముగింపు నాడు శివపార్వతుల కల్యాణం జరుగుతుంది. అయితే, ఈ సందర్భంగా ఆలయ పూజారి భక్తులను దీవించే విధానం విస్మయం కలిగిస్తుంది. భక్తులు వరుసగా నిలబడగా, వారిని కాలితో తన్నుకుంటూ పూజారి ముందుకెళతాడు. అనంతరం ఆ భక్తులు గులాబీ రంగు నీటితో స్వామివారికి వసంతోత్సవం నిర్వహిస్తారు.
పూజారితో తన్నించుకుంటే మోక్షం లభిస్తుందన్నది భక్తుల విశ్వాసం. వీరభద్రస్వామి స్వయంగా పూజారి రూపంలోనే వచ్చి తమను తంతాడని, తద్వారా తమ పాపాలు తొలగిపోతాయన్నది భక్తుల నమ్మిక. తల్లిదండ్రులైన శివపార్వతుల కల్యాణంలో మానవమాత్రులు తప్పిదాలకు పాల్పడ్డారని భావించి, వీరభద్రస్వామి ఆగ్రహం వ్యక్తం చేస్తాడని, అందుకే వారిని ఆ విధంగా కాలితో తన్ని శిక్షిస్తాడని స్థలపురాణం చెబుతోంది. కాగా, ఈ తన్నుల సంప్రదాయం 500 ఏళ్లుగా కొనసాగుతోందట.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa