మనిషి మధ్యాహ్నం తీసే కునుకు అతనికి ఎన్నో ప్రయోజనాలే కలిగిస్తాయని తేలింది. మధ్యాహ్నం భోజనం తర్వాత కునుకుపై ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అధ్యయనాలు ఇప్పటి వరకు జరిగాయి. మధ్యాహ్నం కునుకు మంచి ఫలితాలను ఇస్తుందని ఎక్కువ శాతం అధ్యయనాలు స్పష్టం చేశాయి.
మధ్యాహ్నం భోజనం చేసిన వెంటనే లేదా కొంత సమయం తర్వాత నిద్రించడం వల్ల రిఫ్రెష్ అయిన భావన కలుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు. అదే సమయంలో మధ్యాహ్నం భోజనంతో బద్ధకం, ఊబకాయం, రాత్రి నిద్రా భంగం సమస్యలు వస్తాయని కొన్ని అధ్యయనాలు చెప్పగా అది నిజం కాదన్నది మెజారిటీ వైద్యుల అభిప్రాయం. అనేక మతాలు, సంస్కృతులు సైతం మధ్యాహ్న నిద్రను సమర్థించిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. శతాబ్దాల నుంచి రోజువారీ అలవాట్లలో భాగంగా ఉన్న విషయం తెలిసిందే.
జీర్ణశక్తి
లంచ్ తర్వాత కాస్త విశ్రాంతి తీసుకోవడం జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. విశ్రాంతి తీసుకోవడం వల్ల ఆ సమయంలో శక్తి అంతా జీర్ణక్రియకు వినియోగించుకునే వీలు కలుగుతుంది. దాంతో తీసుకున్న ఆహారం మెరుగ్గా జీర్ణమై, పోషకాలు శరీరం అంతటికీ చేరగలవు. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, మలబద్ధకం, చుండ్రు వంటి సమస్యలను కూడా నివారించొచ్చు.
రాత్రి నిద్రకు అడ్డు కాదు
మధ్యాహ్నం నిద్రించడం వల్ల రాత్రి నిద్ర ఆలస్యమవుతుందని.. సరిగ్గా పట్టదన్న అపోహ ఉంది. కానీ, నిద్ర సమస్యలకు మధ్యాహ్నం నిద్ర కారణం కాదు. రాత్రి వేళలు క్రమబద్ధంగా లేకపోయినా, ఆలోచనలు ఎక్కువైనా, శారీరక కదలికలు తగినంత లేకపోయినా, ఒత్తిడి ఎదుర్కొంటున్నా నిద్ర సరిగ్గా రాదు. మధ్యాహ్నం 1-3 గంటల మధ్య 30 నిమిషాలు నిద్రించి.. సాయంత్రం సమయంలో మోస్తరు వ్యాయామం చేసిన వారికి రాత్రి చక్కటి నిద్ర పడుతున్నట్టు అధ్యయనాల్లో గుర్తించారు.
హార్మోన్లలో సమతుల్యత
హార్మోన్లలో అసమతుల్యత వల్ల బాధపడుతున్న వారు మధ్యాహ్నం కొంత సేపు నిద్రించడం వల్ల వారి పరిస్థితి మెరుగుపడుతుంది. మధుమేహులు, పీసీవోడీ, థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్న వారు మధ్యాహ్నం కునుకు అలవాటు చేసుకోవడం మంచిదన్నది వైద్యుల సూచన.
మెమొరీ
జ్ఞాపకశక్తికి కూడా మధ్యాహ్నం నిద్ర మేలు చేస్తుంది. మంచి మూడ్ కు సాయపడుతుంది. ఒత్తిడి తగ్గడానికి కూడా మధ్యాహ్నం నిద్ర ఒక చిట్కాయే.
ఎలా..
తిన్న వెంటనే లేదా కొద్ది సమయం తర్వాత ఎడమవైపునకు తిరిగి 30 నిమిషాల పాటు నిద్రించడం సరైనది. నిద్ర పట్టకపోయినా పర్వాలేదు. కళ్లు మూసుకుని పడుకోవాలి. చిన్న వారు అయితే 90 నిమిషాల వరకు నిద్రించొచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa