ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మోసాన్ని తట్టుకోలేక నిద్ర మాత్రలు మింగిన తల్లీ, కొడుకు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 28, 2022, 12:21 PM

తన కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం వస్తుందనే ఆశతో తాను నివశించే ఇంటినే తనఖాపెట్టి మరీ రూ. 25 లక్షలను ఘరానా మోసగాడికి చెల్లించి మూడేళ్లయినా అటు కుమారుడికి ఉద్యోగం రాక ఇటు తనఖా పెట్టిన ఇల్లు కోల్పాతామనే భయంతో ఆ మాతృమూర్తి, తన కుమారుడితో కలసి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మంగళగిరి -తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధి ఆత్మకూరులో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే. ఆత్మకూరు కు చెందిన నందం రామకుమారి గత కొన్నేళ్ల క్రితం భర్తను కోల్పోయి అదే గ్రామంలో రేషన్ దుకాణంతో పాటు టిఫిన్ హోటల్ నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటోంది.


ఎంబీఏ వరకూ చదివిన కుమారుడు మణికంఠకు బెంగుళూరులోని ఓ ప్రైవేటు కంపెనీలో గత మూడేళ్ల క్రితం నెలకు రూ. 60వేల జీతం కలిగిన ఉద్యోగం రాగా వెళ్లిపోయాడు. దీంతో ఒంటరిగా ఉండలేని రామకుమారి తన కుమారుడికి దగ్గరలో ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం వస్తే బాగుంటుందని భావించి తన వద్దకు వచ్చే వారందరినీ ఆరా తీసింది.


ఈ క్రమంలో యర్రబాలెం గ్రామానికి చెందిన కాజ సంజీవ కుమార్ అనే ఘరానా మోసగాడు ఆమెకు పరిచయయ్యాడు. అక్కా అంటూ ఎంతో ఆప్యాయంగా పలుకరిస్తూ తాను జర్నలిస్ట్ నని, సీఎంఓ కార్యాలయంలో తనకు ఎంతోమంది తెలిసినవారున్నారని, నీ కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించే బాధ్యత నాదంటూ నమ్మించాడు.


దీంతో రామకుమారి తన చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం వస్తుందనే ఆశతో తాను నివశించే ఇంటిని తనఖా పెట్టి మరీ సంజీవకుమార్ కు రూ. 25 లక్షలను ఇచ్చింది. బెంగుళూరులో ఉద్యోగం చేసుకుంటున్న కుమారుడు మణికంఠను సైతం నమ్మించి తిరిగి ఇంటికి రప్పించింది. మూడేళ్లయినా కుమారుడు మణికంఠకు సంజీవ కుమార్ ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించకపోవడంతో రామకుమారికి అనుమానం వచ్చి తనకు తెలిసిన పెద్దల సమక్షంలో సంజీవకుమార్ ను నిలదీసింది. దీంతో మోసగాడు రామకుమారికి రూ. 25 లక్షలు ఇవ్వాల్సిన మాట వాస్తవమేనని, వీలైనంత త్వరలోనే ఆమె కుమారుడికి ఉద్యోగం ఇప్పించడం గానీ, లేకుంటే తాను తీసుకున్న రూ. 25 లక్షలను తిరిగి ఇచ్చివేస్తానని నమ్మబలికాడు. దీంతో పెద్దలు సైతం సంజీవకుమార్ మాటలు నమ్మారు.


అప్పటి నుంచి అదిగో. ఇదిగో అంటూ కాలయాపన చేసాడే తప్ప మణికంఠకు ఉద్యోగం ఇప్పించలేకపోగా తీసుకున్న రూ. 25లక్షలను కూడా తిరిగి చెల్లించలేదు. అదేమని అడుగుతుంటే తల్లి, కుమారులిద్దరినీ చంపేస్తానని సంజీవ కుమార్ బెదిరించాడు. దీంతో బాధితురాలు రామకుమారి తనకు జరిగిన మోసంపై గత రెండు రోజుల క్రితం మంగళగిరి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారిస్తోన్నారు. ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం రామకుమారి, ఆమె కుమారుడు మణికంఠ లు తమ నివాస గృహంలోనే తలుపులు వేసుకుని నిద్రమాత్రలు మింగి మంచాలపై సృహకోల్పోయి పడి ఉన్నారు. రాత్రి 10 గంటల సమయంలో గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు క్షతగాత్రులిద్దరినీ చికిత్స నిమిత్తం 108అంబులెన్స్ లో చినకాకాని ఎన్నారై ఆసుపత్రికి తరలించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa