ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వెయ్యేళ్ల తరువాత ఒకే సరళ రేఖపైకి నాలు గ్రహాలు

international |  Suryaa Desk  | Published : Mon, May 02, 2022, 03:50 PM

అకాశంలో అద్బుతాలు అరుదుగా జరుగుతుంటాయి. ఈ క్రమంలోనే ఆకాశంలో ఇటీవల ఓ అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. దాదాపు సహస్రాబ్ది తర్వాత (1000 ఏళ్లు) సౌర కుటుంబంలోని నాలుగు గ్రహాలు ఒకే సరళరేఖపైకి వచ్చాయి. శుక్రుడు, అంగారకుడు, బృహస్పతితో పాటు శని ఒకే రేఖపై వచ్చి కనువిందు చేశాయి. సూర్యోదయానికి ముందు ఈ నాలుగు గ్రహాలు ఒకే రేఖపై దర్శనమిచ్చాయని భువనేశ్వర్లోని పఠాని సమంత ప్లానిటోరియం డిప్యూటీ డైరెక్టర్ సువేందు పట్నాయక్ తెలిపారు. సౌర వ్యవస్థలో గ్రహాలు ఒకే వరుసలోకి వచ్చే క్రమాన్ని ‘ప్లానెట్ పరేడ్’గా పేర్కొంటారని పట్నాయక్‌ వివరించారు.


‘2022 ఏప్రిల్ 26, 27 తేదీల్లో ఈ అరుదైన కూర్పు కనిపించింది. దీనిని ప్లానెట్ పరేడ్గా పేర్కొంటారు.. దీనికి శాస్త్రీయంగా ఎలాంటి నిర్వచనం లేదు’ అని ఆయన అన్నారు. ‘అంతరిక్షంలో సాధారణంగా మూడు ప్లానెట్ పరేడ్లు కనిపిస్తాయి.. అందులో మొదటిది.. సూర్యుడికి ఒకవైపున గ్రహాలు ఒకే వరుసలో కనిపిస్తాయి.. ఇలా ఒకవైపున కనిపించడం సర్వసాధారణం.. ఏడాదిలో ఇలా చాలా సార్లు ఇలా జరుగుతుంది.. ఏడాదిలో ఒకసారి నాలుగు గ్రహాలు ఒకే వరుసలోకి వస్తాయి.. ప్రతి 19 ఏళ్లకు ఒకసారి ఐదు గ్రహాలు ఒక వరుసలోకి వస్తాయి. ఎనిమిది గ్రహాలు సైతం ఇలా ఒకే వరుసలోకి వస్తాయని.. కానీ దీనికి 170 ఏళ్లు పడుతుంది’’ అని పేర్కొన్నారు.


‘ఇక రెండోది.. గ్రహాలు అవి కనిపించే పరిస్థితులతో సంబంధం లేకుండా ఒకే సమయంలో ఆకాశంలో ఒక చిన్న ప్రాంతంలో కనిపిస్తాయి. దానిని సైతం ప్లానెట్ పరేడ్గానే పిలుస్తారు.. గతంలో 2002 ఏప్రిల్ 18న, 2020 జులైలో ఇలాంటి ప్లానెట్ పరేడ్ కనిపించింది.. మూడోది.. కొన్ని గ్రహాలకు అనుకూలమైన పరిస్థితులు ఉన్న అరుదైన సందర్భాల్లో ఈ ప్లానెట్ పరేడ్ ఏర్పడుతుంది.. మూడు గ్రహాలు ఒకే వరుసలోకి రావడం ఒక ఏడాదిలో చాలా సందర్భాల్లో కనిపిస్తుంది’ అని పట్నాయక్‌ వివరించారు.


ఈ గ్రహ చతుష్టయం ఏప్రిల్ 26, 27న రెండు రోజులు సూర్యోదయానికి ఒక గంట ముందు తూర్పు అక్షాంక్షానికి 30 డిగ్రీల కోణంలో ఒకే వరుసలో చంద్రుడితో పాటు నాలుగు గ్రహాలు కనిపించాయి. ఇది మూడో రకం ప్లానెట్ పరేడ్. ఇంతకు ముందు దాదాపు 1000 ఏళ్ల కిందట క్రీ.శ 947లో ఇలా జరిగింది. శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శని గ్రహాలు ఒకే సరళరేఖపైకి వచ్చినప్పుడు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటే టెలిస్కోప్ అవసరం లేకుండానే వాటిని నేరుగా చూడొచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు.


ఇక, ఏప్రిల్ 30న శుక్రుడు, బృహస్పతి అత్యంత సమీపంగా రానున్నాయి. బృహస్పతికి దక్షిణం వైపు 0.2 డిగ్రీల కోణంలో శుక్రుడు కనిపించనున్నాడు. ప్లానెటరీ పరేడ్‌లో భాగంగా ఏప్రిల్ 17 నుంచి ఈ నాలుగూ దాదాపు ఒకే సరళరేఖపైకి వచ్చినట్టు కనిపించాయి. కానీ, ఏప్రిల్ 20న సూర్యోదయానికి ముందు మరింత స్పష్టంగా కను విందు చేశాయి. కానీ, భూమి నుంచి చూస్తే ఈ గ్రహాలన్నీ దగ్గరగా ఉన్నట్టు కనిపించినా.. వాటి మధ్య దూరం బిలియన్ కిలోమీటర్లు ఉంటుంది. సూర్యుడి చుట్టూ భూమి పరిభ్రమించే క్రమంలో వీటి కక్ష్యలో చోటుచేసుకునే మార్పుల వల్ల ఇలాంటి విశేషాలు ఏర్పడతాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa