ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నీతులు చెప్పేందుకే...పాటించేందుకు కాదు..ఇది అమెరికా తీరు

international |  Suryaa Desk  | Published : Mon, May 02, 2022, 04:17 PM

నీతులు చెప్పేందుకేనని పాటించేందుకు మాత్రం కాదన్నట్లుగా అగ్రరాజ్యమైన అమెరికా తీరుగా కనిపిస్తోంది. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర ప్రారంభించిన వెంటనే ఆగమేఘాలపై స్పందించింది మొదటి దేశం అగ్రరాజ్యం అమెరికానే. ప్రపంచంలో ఏ దేశం మరో దేశంపై విధించని అత్యంత కఠిన ఆంక్షలను ప్రకటించింది. ఉక్రెయిన్‌కు ఆర్థిక, ఆయుధ సాయంతో మద్దతుగా నిలిచి రష్యాను బలగాలను నిలువరించడంలో కీవ్ సేనలకు తోడ్పాటు అందిస్తోంది. అయితే రష్యా-అమెరికా వాణిజ్య దిగుమతులకు సంబంధించి అత్యంత ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఉక్రెయిన్‌పై సైనిక చర్య మొదలుపెట్టిన తర్వాత రష్యా నుంచి అత్యధిక స్థాయిలో ఆయిల్‌ను భారత్ దిగుమతి చేసుకుంటోందని అందరూ భావించారు.


మాస్కో, న్యూఢిల్లీకి దశాబ్దాలుగా బలమైన సంబంధాలు ఉండటం, చిరకాల మిత్రదేశం కాబట్టి ఇరు దేశాల మద్య చమురు వాణిజ్యంపై యుద్ధ ప్రభావం పడలేదని భావించవచ్చు. కానీ, ఇక్క ఆసక్తికర విషయం ఏంటంటే.... గత కొద్ది నెలల కాలంలో రష్యా నుంచి శిలాజ ఇంధనాన్ని భారత్ కంటే అమెరికానే అత్యధిక మొత్తంలో దిగుమతి చేసుకుంది. ఈ విషయాన్ని సెంటర్ ఫర్ రిసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ (సీఆర్ఈఏ) సంస్థ వెల్లడించింది.


యుద్ధం మొదలైన తర్వాత రష్యా నుంచి చమురు దిగుమతులు చేసుకున్న దేశాల జాబితాలో జర్మనీ అగ్రస్థానంలో నిలవడం గమనార్హం. రెండో స్థానంలో ఇటలీ, మూడో స్థానంలో చైనా నిలిచాయి. టాప్-10లో నెదర్లాండ్, టర్కీ, ఫ్రాన్స్, బెల్జియం, స్పెయిన్, దక్షిణ కొరియా, పోలెండ్ సహా అత్యధికంగా ఈయూ దేశాలు ఉన్నాయి. ఓ వైపు ఆంక్షలు కొనసాగుతున్నప్పటికీ ఇతర దేశాల అవసరాలను, తన వాణిజ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రష్యా భారీగా ఎగుమతులు చేపట్టింది. ఒక్క ఇంధన రంగంలోనే 63 బిలియన్ యూరోల మేర చమురు ఎగుమతి చేసింది. ఇందులో 71 శాతం ఐరోపా దేశాలకు ఎగుమతి చేయడం విశేషం.


రాయితీపై వస్తుండటంతో భారత్ భారీగానే రష్యా ముడిచమురు కొనుగోలు చేసినా.. అమెరికా దిగుమతి చేసుకున్న మొత్తంతో పోల్చితే చాలా తక్కువే. భారీగా రాయితీ వస్తుందని భారతీయ అధికారులు చెబుతున్నా.. పలు పశ్చిమ నివేదికలను బట్టి బ్యారెల్‌కు 30 డాలర్ల కంటే ఎక్కువ లభించడం లేదు. అంతేకాదు, రవాణా ఖర్చులు, బీమా, వార్ ప్రీమియం కూడా చెల్లించాల్సి రావడంతో ప్రయోజనం పెద్దగా ఉండదని ప్రభుత్వం భావిస్తున్నట్టు అభిజ్ఞ‌ాన వర్గాలు పేర్కొన్నాయి. ఇంధనం, ఆహారం, ఫార్మా ఉత్పత్తులకు ఆంక్షలు వర్తించనందున ముడి చమురును రాయితీపై అందించడానికి సిద్ధంగా ఉన్నామని రష్యా అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించారు.


‘‘భారత్, ఈజిప్ట్, ఇతర అసాధారణ గమ్యస్థానాలకు రష్యన్ చమురు ఎగుమతులు అందరి దృష్టిని ఆకర్షించాయి... మా డేటా దాదాపు సున్నా నుంచి స్పష్టమైన పెరుగుదలను చూపుతుంది. అయినప్పటికీ, ఐరోపాకు ఎగుమతులలో స్వల్పంగా తగ్గినా కొత్త గమ్యస్థానాలు దీనిని భర్తీ చేయలేవు’’ సీఆర్ఈఏ పేర్కొంది. భారత్ విషయానికి వస్తే జనవరి-ఫిబ్రవరితో పోల్చితే ఏప్రిల్ మొదటి మూడు వారాల్లో బొగ్గు 130 శాతం, ముడి చమురు 340 శాతం మేర రవాణా పెరిగింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa