ఓ పాఠశాలలో అందరూ చూస్తుండగానే ఓ విచిత్ర ఘటన నెలకొంది. సాధారణంగా విద్యార్థుల మధ్య జరిగే గొడవలను, ఘర్షణలను ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్ తీరుస్తారు. గట్టిగా మందలించి వారిని దారిలో పెడుతుంటారు. స్నేహితులుగా కలసిమెలసి ఉండాలని హితవు పలుకుతారు. కానీ రివర్స్లో ప్రిన్సిపాలే గొడవకు దిగితే ఎలా ఉంటుంది. ఇలాంటి సంఘటనే జార్ఖండ్లో చోటుచేసుకుంది. ఒక పాఠశాలలోని ప్రిన్సిపాల్, ప్యూన్ కొట్టుకున్నారు. తోటి ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది అందరూ చూస్తుండగానే కర్రలతో ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. పిల్లల్లాగా తిట్టుకుంటూ ఒకరినొకరు కొట్టుకున్నారు. ఈ సంఘటన మేదినీనగర్లోని జిల్లా పాఠశాలలో జరిగింది.
సరిగ్గా పని చేయడం లేదని ప్యూన్ హిమాన్షు తివారీపై... ప్రిన్సిపాల్ కరుణ శంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇద్దరూ దుర్భాషలాడుకున్నారు. ఆఖరికి ఒకరినొకరు తోసుకున్నారు. ఇద్దరి మధ్య ఘర్షణ పెరిగి ఇద్దరూ కొట్టుకున్నారు. ఈ గొడవలో ప్యూన్ హిమాన్షు తివారీ చేతికి గాయం కూడా అయింది.
అయితే తివారీ ఎప్పుడూ ఆలస్యంగా వస్తున్నాడని, ఏ పని చేయకుండా రోజంతా ఖాళీగా గడుపుతున్నారని ప్రిన్సిపాల్ కరుణ శంకర్ ఆరోపించారు. టైంకి రావడం లేదని అడిగితే తనను తిట్టాడని ఆయన చెప్పుకొచ్చారు. "హిమాన్షు తివారీ పాఠశాలను శుభ్రం చేయడు. తోటలోని మొక్కలకు నీరు పెట్టడు. ఆ మొక్కలు వేడిలో ఎండిపోతున్నాయి. సమయానికి పాఠశాలకు కూడా రాడు. వచ్చిన కొంతసేపటికే ఇంటికి తిరిగి వెళ్తాడు" అని కరుణ శంకర్ అన్నారు.
మరోవైపు ప్యూన్ కూడా ప్రిన్సిపాల్పై మండిపడ్డాడు. ఉదయం ఆరు గంటలకే పాఠశాలకు చేరుకున్నానని, కానీ ప్రిన్సిపాల్ కారణం లేకుండానే తనపై కర్రతో దాడి చేశాడని ఆరోపించాడు. పైగా ప్రిన్సిపాల్ అవినీతికి పాల్పడినట్టు చెప్పాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa