ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తల్లి దూరమైందన్న వేధనతో...ఆ కొడుకు ఏకంగా బీఎండబ్ల్యూ అలా తోసేశాడు

national |  Suryaa Desk  | Published : Sat, May 28, 2022, 11:18 PM

తమ పిల్లలు  చనిపోతే  ఆ కడుపు కోత తల్లులకు ఎంతుంటుందో తనకు జన్మనిచ్చిన తల్లి చనిపోతే ఆ పుత్రుడికి ఎలా ఉంటుందో చెప్పలేం. అలా తల్లి దూరమైన శోకంలో ఓ కొడుకు ఏకంగా డిప్రేషన్ లోకి వెళ్లాడు. ఆ డిప్రేషన్ లో తన బీఎండబ్ల్యూ కారును కావేరి నదిలో తోసేశాడు. ఈ అరుదైన ఘటన కర్ణాటకలోని శ్రీరంగపట్నంలో చోటుచేసుకుంది. కావేరి నదిలో అత్యంతం విలువైన ఓ బీఎండబ్ల్యూ కారు మునిగిపోతూ కనిపించింది. దాంతో గ్రామస్థులు, మత్స్యకారులు, స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఏదో ప్రమాదం జరిగిందని సందేహించి ఆ సమాచారాన్ని వెంటనే పోలీసులకు అందించారు. పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. నదిలోకి డైవ్ చేసే సిబ్బందిని పిలిపించి.. కారులో ఎవరైనా చిక్కుకుపోయారో లేదో తనిఖీ చేయించారు.


అయితే లోపల ఎవరూ లేరని నిర్ధారించుకున్న తర్వాత కారును బయటకు తీశారు. పోలీసులు కారు రిజిస్ట్రేషన్ వివరాలను తెలుసుకుని, రవాణా శాఖ ద్వారా కారు బెంగళూరు మహాలక్ష్మి లే అవుట్‌లో నివసిస్తున్న వ్యక్తికి చెందినదని తెలుసుకున్నారు. ఆ వ్యక్తిని తీసుకొచ్చి శ్రీరంగపట్నంలో విచారించారు. అతను పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు అసలు విషయం అర్థం కాలేదు. వెంటనే అతని కుటుంబ సభ్యులను సంప్రదించారు.


వారు అసలు విషయం చెప్పగా ఆశ్చర్యపోవడం పోలీసులు వంతు అయింది. ఇంతకీ ఆ వ్యక్తి తల్లి మరణించడంతో నిరాశకు గురయ్యాడని, డిప్రెషన్‌లోకి జారుకుని కారును నదిలోకి తోసేశాడని చెప్పారు. బెంగళూరులో తన ఇంటికి వెళ్లే సమయంలో కారును నదిలో ముంచేశాడని కుటుంబ సభ్యులు చెప్పారు. ఇదే విషయాన్ని పోలీసులు తెలియజేశారు. అతని కుటుంబ సభ్యులు స్టేట్‌మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు అతనిని వదిలేశారు. ఎటువంటి ఫిర్యాదును నమోదు చేయలేదు. జరిమానా విధించలేదు. అనంతరం బీఎండబ్ల్యూ కారును ఆ కుటుంబం తిరిగి ఇంటికి తీసుకెళ్లింది. ఇదిలావుంటే ఈ ఘటన తర్వాత ఆ వ్యక్తిని మానసిక ఆస్పత్రికి తరలించినట్టు తెలుస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa