కోర్టులను ఆశ్రయించలేని వారి కోసమే ఉన్నామన్నట్లుగా ఎన్జీటీ వ్యవహార సరళి ఉందని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. విశాఖ పరిధిలోని రిషికొండలో ఏపీ ప్రభుత్వం చేపట్టిన ఓ పర్యాటక ప్రాజెక్టు పనులను నిలుపుదల చేస్తూ జాతీయ హరిత ధర్మాసనం (ఎన్జీటీ) జారీ చేసిన ఉత్తర్వులపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అంతేకాకుండా కోర్టులను ఆశ్రయించలేని వారి కోసమే ఎన్జీటీ పనిచేస్తున్నట్లుగా ఉందని కూడా సుప్రీం ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎన్జీటీ ఆదేశాలను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ హిమా కోహ్లీతో కూడిన వెకేషన్ బెంచ్ ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేసింది.
ఈ కేసు వివరాల్లోకి వెళితే... రిషికొండ పరిధిలో నూతన పర్యాటక ప్రాజెక్టు పనులను చేపడుతున్న సంస్థ నిబంధనలు పాటించడం లేదంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఎన్జీటీని ఆశ్రయించారు. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన ఎన్జీటీ సదరు పనులను నిలిపివేయాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్జీటీ ఇచ్చిన ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
మంగళవారం ఈ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇదేమిటి, పార్లమెంటు సభ్యుల లేఖలను కూడా జాతీయ హరిత ధర్మాసనం విచారిస్తోందని సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. కోర్టులను ఆశ్రయించలేని వారి కోసమే ఉన్నామన్నట్లుగా ఎన్జీటీ వ్యవహార సరళి ఉందని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. అది ఉన్నది సాధారణ పౌరులకే కానీ చట్ట సభ్యులకు కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఈ సందర్భంగా ఎన్జీటీ తీర్పు కాపీ ఉందా అని ఏపీ ప్రభుత్వ తరఫు న్యాయవాది అభిషేక్ మను సింగ్విని కోర్టు అడగగా అందుకోసం సమయం కావాలని ఆయన కోరారు. దీంతో ఈ పిటిషన్ తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa