ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రష్యా విజయం సాధిస్తే మాత్రం...యూరప్ ఖండంలోని ప్రతి ఒక్కరికీ గడ్డు కాలం

national |  Suryaa Desk  | Published : Sun, Jun 05, 2022, 03:12 PM

యుద్దంలో రష్యా పై చెయ్యి సాధిస్తే మాత్రం యూరప్ ఖండంలోని ప్రతి ఒక్కరికీ గడ్డు కాలం వస్తుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్‌స్కీ ఆందోళన వ్యక్తంచేశారు. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రకు గురువారంతో 100 రోజులు పూర్తయ్యింది. ఈ యుద్ధానికి ఎప్పుడు ఎక్కడ ముగింపు ఉంటుందో తెలియడం లేదు. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలో రష్యా భీకర దాడులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో లగ్జెంబర్గ్ పార్లమెంట్‌ను ఉద్దేశించి ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్‌స్కీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రస్తుత యుద్ధంలో రష్యా విజయం సాధిస్తే ఐరోపావ్యాప్తంగా చీకటి రోజులు వస్తాయని ఆయన హెచ్చరించారు. ఇప్పటికే తమ భూభాగంలో దాదాపు 20 శాతం ప్రస్తుతం రష్యా సైన్యం నియంత్రణలో ఉందని తెలిపారు.


‘ఈ యుద్ధంలో మేం విజయం సాధిస్తే.. ఐరోపావాసులు ఎప్పటిలాగే తమ స్వేచ్ఛను ఆస్వాదించగలరు.. కానీ, ఉక్రెయిన్‌తోపాటు ఐరోపాలో స్వేచ్ఛను నాశనం చేయాలనుకుంటున్న ఓ వ్యక్తి పైచేయి సాధిస్తే మాత్రం.. యూరప్ ఖండంలోని ప్రతి ఒక్కరికీ గడ్డు కాలం వస్తుంది’ అని పుతిన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇది పూర్తి స్థాయి యుద్ధమని, అందుకే ప్రపంచ దేశాల మద్దతు కోరుతున్నామని జెలెన్‌స్కీ అన్నారు. ఇప్పటివరకు రష్యన్‌ బలగాల దాడుల్లో 14 వేల మంది సైనికులు, సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయారని జెలెన్‌స్కీ ఆవేదన వ్యక్తం చేశారు.


అంతేకాదు, శత్రువులతో తమ సైనిక దళాలు వీరోచితంగా పోరాడుతున్నాయని, ఇప్పటి వరకు 1,017 జనావాస ప్రాంతాలకు క్రెమ్లిన్ చెర నుంచి విముక్తి కలిగించాయని చెప్పారు. ‘‘ఉక్రెయిన్‌లోని 3,620 జనావాస ప్రాంతాలపై మాస్కో బలగాలు దాడి చేశాయి.. వాటిలో 1,017ను తిరిగి మా ఆధీనంలోకి తెచ్చుకున్నాం. మరో 2,603 ప్రాంతాలకు విముక్తి కల్పించాల్సి ఉంది.. ఇప్పటికీ.. మా భూభాగంలో ఐదింట ఒకవంతు దురాక్రమణదారుల నియంత్రణలో ఉంది.. ఇది 1.25 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో సమానం.. బెల్జియం, నెదర్లాండ్స్‌, లక్జెంబర్గ్‌లకన్నా చాలా ఎక్కువ’’ అని జెలెన్‌స్కీ చెప్పారు.


ఈ ఏడాది ఫిబ్రవరి 24 న దండయాత్ర మొదలైన తర్వాత రష్యా ఎంత మేర భూభాగాన్ని స్వాధీనం చేసుకున్నదీ జెలెన్‌స్కీ వెల్లడించలేదు. అయితే, ఎనిమిదేళ్ల కిందట నుంచే తమ భూభాగంలో రష్యా ఆక్రమణ మొదలైందని ఆరోపించారు. 2014- 22 మధ్యకాలంలో దాదాపు 43 వేల చదరపు కి.మీ మేర భూభాగాన్ని రష్యా తన నియంత్రణలోకి తెచ్చుకుందని తెలిపారు. క్రిమియాతోపాటు డొనెట్స్క్, లుహాన్స్క్‌లలోని ప్రధాన ప్రాంతాలు ఇందులో ఉన్నాయని వివరించారు. తీవ్ర మానవతా సంక్షోభంలోని దేశం కూరుకుపోయిందని, 12 మిలియన్ల మంది పౌరులు నిరాశ్రయులయ్యారని వాపోయారు. మరో ఐదు మిలియన్లకు పైగా దేశాన్ని విడిచిపెట్టారని వెల్లడించారు.


తమ భూభాగంలో సుమారు 3 లక్షల చదరపు కిలోమీటర్ల మేర ప్రాంతాలు ప్రమాదకర ల్యాండ్‌మైన్స్‌, పేలుడు పదార్థాలతో నిండి ఉన్నాయని తన ప్రసంగంలో ప్రస్తావించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa