ప్రకాశం జిల్లా సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబుపై సొంత పార్టీ నేతలే భగ్గుమంటున్నారు. ఆయన్నుంచి మమ్మల్మీ కాపాడండి అంటూ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి సంతనూతలపాడు వైసీపీ నేతలు కొందరు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే వైఖరి దారుణంగా ఉందని, సొంత పార్టీ నేతలపైనే కక్ష సాధింపులకు దిగుతున్నారని నాగులుప్పలపాడ మండలానికి చెందిన నేతలు ఆరోపించారు. గ్రామాల్లో వర్గ రాజకీయాలు చేస్తూ సొంత పార్టీ వారిపైనే తన అనుచరులతో తప్పుడు కేసులు బనాయించి వేధింపులకు గురిచేస్తున్నారని వాపోయారు. మా మండలం వరకు ప్రత్యేకంగా ఒక ఇంఛార్జిని నియమించాలని వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డిని కోరారు.
ఒంగోలులోని బాలినేని నివాసానికి నాగులుప్పలపాడు మండలంలోని పలు గ్రామాల నుంచి పెద్దసంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, డ్వాక్రా మహిళలు తరలివచ్చారు. ఎమ్మెల్యే సుధాకర్బాబు ఏకపక్ష ధోరణితో తాము తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు. ఉప్పుగుండూరులో పది మంది కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టించి వేధించారని తెలిపారు. ఈ కేసు వాయిదాకు వెళ్లి వస్తుండగా మాదిగ కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మూరి కనకారావు కారు డ్రైవర్ ప్రమాదంలో మృతిచెందినట్టు మాజీ మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.
తనకు వ్యతిరేకులని కొందరిపై ముద్ర వేసి సోషల్ మీడియాలో తన అనుచరుల ద్వారా అనుచిత వ్యాఖ్యలు చేయిస్తున్నారని ఆరోపించారు. ఎవరైనా ప్రశ్నిస్తే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి జైలుకు పంపుతామని బెదిరిస్తున్నారని ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే, ఆయన అనుచరుల బారి నుంచి మమ్మల్ని కాపాడాలని వేడుకున్నారు. నియోజకవర్గంలో పనులు, సీఎం సహాయ నిధి చెక్కుల్లోనూ కమీషన్లు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేపై డ్వాక్రా సంఘాలు కూడా ఆరోపించడం గమనార్హం.
ప్రస్తుతం పనిచేస్తున్న ఏపీఎంను బదిలీ చేయించేందుకు ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నారని వివరించారు. ఈ ఫిర్యాదులపై స్పందించిన బాలినేని.. సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే సుధాకర్బాబుతో మాట్లాడతానని చెప్పారు. అప్పటికీ తీరు మారకపోతే ముఖ్యమంత్రి దృష్టికి విషయాన్ని తీసుకెళ్తానని వారికి స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa