ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గన్నవరం వైసీపీలో లుకలుకలు...మరింత ముదురుతున్న వివాదం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 12, 2022, 02:27 PM

రాష్ట్రవ్యాప్తంగా వివిధ అసెంబ్లీ నియోజకవర్గాలలో వైసీపీ పార్టీలు గ్రూపు రాజకీయాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. వీటిలో కొన్ని నియోజకవర్గాలు మాత్రం వైసీపీకి పెద్ద తలనొప్పిగా మారాయి.  అలాంటి వాటిలో గన్నవరం నియోజకవర్గం ఒకటి.  గన్నవరం వైసీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. గన్నవరం అధికార పార్టీలో ఇంటిపోరు రోజు రోజుకీ ముదురుతోంది. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌ను టార్గెట్ చేస్తూ యార్లగడ్డ వెంకట్రావు , దుట్టా రామచంద్రరావు నిన్న విమర్శలు గుప్పించారు.


యార్లగడ్డ వ్యాఖ్యలకు వల్లభనేని వంశీ స్ట్రాంగ్ కౌంటర్‌ ఇచ్చారు. జస్టిస్ చౌదరిలుగా దారినపోయే ప్రతివాడు కామెంట్స్ చేస్తుంటారని వ్యంగ్యంగా అన్నారు. గన్నవరం నియోజకవర్గం ప్రజలు తనను ఆశీర్వదించారని, వాళ్లకి ఏమైనా ఇబ్బంది ఉంటే అధిష్ఠానికి చెప్పుకోవాలని సూచించారు. తనను పని చేయమని సీఎం జగన్ చెప్పారని పునరుద్ఘాటించారు. ఒకవేళ ఈ విషయంలో యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావుకి బాధ ఉంటే సీఎంను కలవాలని అన్నారు. అంతేకానీ, ఇలాంటి మాటలు మాట్లాడం సరికాదని హితవు పలికారు.


నియోజకవర్గంలోని ప్రజలకు ఏం చేయాలో తనకు తెలుసని పేర్కొన్నారు. ‘‘పనిచేయకుండా హడావుడి చేసే వాళ్లను చాలా మందిని చూశాను. నేను హీరోనా.. విలన్‌నా గన్నవరం ప్రజలను అడిగితే చెబుతారు.. నేను విలన్ అని అన్నవారు.. మహేష్ బాబు, ప్రభాస్‌లా?’’ అంటూ ఎద్దేవా చేశారు. మట్టి గురించి నానాయాగి చేసి పేదవాడికి మట్టి అందకుండా చేస్తున్నారని వంశీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రాక్టర్లతో మట్టిని నాలుగు కిలోమీటర్లు తోలితే కనీసం డీజిల్ ఖర్చులు కూడా రావన్నారు. తనపై ఆరోపణలు చేసేవాళ్లంతా చంద్రబాబు స్కూల్ చెందిన వాళ్లే అంటూ ఎమ్మెల్యే వంశీ ధ్వజమెత్తారు.


 టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ వైసీపీలో చేరడాన్ని దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావులు ముందు నుంచి వ్యతిరేకిస్తున్నారు. తమ అసమ్మతిని బాహటంగానే వెళ్లగక్కుతున్నారు. వంశీతో కలిసి పనిచేసేది లేదని తెగేసి చెబుతున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa