మంచి సంబంధం దక్కాలని ఎవరైనా కోరుకొంటారు. ఇందుకోసం శతవిధాల ప్రయత్నిస్తారు. దేవుడిని ముక్కుతారు. వరుడి ఇంట్లో వారిని ఒప్పించే ప్రయత్నం చేస్తారు. కానీ బీహార్ లో అలా కాదు. తమకు ఆ అబ్బాయి నచ్చితే చాలు ఎత్తుకెళ్లి మరీ బలవంతంగా పెళ్లి చేస్తారు. ఇదిలావుంటే తమ దొడ్లొని పశువు అనారోగ్యంతో ఉందని ఓ వైద్యుడికి ఫోన్ చేసిన కొందరు.. ఆ తర్వాత అతడ్ని అపహరించి బలవంతంగా పెళ్లి చేశారు. విస్మయం కలిగించే ఈ ఘటన బిహర్లోని బెగుసరాయ్ జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో వెటర్నరీ డాక్టర్కు ఓ వ్యక్తి ఫోన్ చేసి తమ పశువు అనారోగ్యానికి గురయ్యిందని, వెంటనే రావాలని కోరాడు. వెటర్నరీ డాక్టర్ అక్కడకు వెళ్లిన తర్వాత కిడ్నాప్ చేసి, బలవంతంగా యువతితో వివాహం చేశారని బాధితుడి బంధువు ఒకరు ఏఎన్ఐ మీడియాతో చెప్పాడు.
అటు, తమ కుమారుడ్ని కిడ్నాప్ చేశారని బాధితుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై బెగుసరాయ్ ఎస్పీ యోగేంద్ర కుమార్ మాట్లాడుతూ.. వెటర్నరీ డాక్టర్ తండ్రి పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడని తెలిపారు. దీనిపై విచారణ చేపట్టాలని స్టేషన్ హౌస్ ఆఫీసర్, ఇతర అధికారులను ఆదేశించామని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ఇక, వరుడ్ని అపహరించడం లేదా పకాద్వా వివాహ అనేది బిహార్, ఝార్ఖండ్, ఉత్తర్ ప్రదేశ్లో సర్వసాధారణం. యువకులను ఎత్తుకెళ్లి బెదిరించి బలవంతంగా పెళ్లిళ్లు జరిపిస్తారు. ముఖ్యంగా సమాజంలో ఆర్థికంగా, సామాజికంగా బలవంతులైన కుటుంబాలకు చెందిన యువకుల్ని వధువు తరఫున వాళ్లు కిడ్నాప్ చేసి, పెళ్లికి ఒప్పుకోకపోతే భౌతిక దాడికి దిగుతారు. కొన్నేళ్ల కిందట బిహార్లో జరిగిన ఇటువంటి సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
బొకారో స్టీల్ ప్లాంట్లో జూనియర్ మేనేజర్గా పనిచేస్తున్న 29 ఏళ్ల వినోద్ కుమార్ను పట్నాలోని పండారక్ ప్రాంతంలో కిడ్నాప్ చేసి, కొట్టి బలవంతంగా పెళ్లి చేశారు. పెళ్లి దుస్తుల్లో ఉన్న కుమార్.. ఆచారాలను ఆపమని వేడుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిని అందరూ తీవ్రంగా ఖండించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa