విమాన ప్రయాణాలు సాహసంతో కూడుకొన్నవిగానే చెప్పవచ్చు. ఏ మాత్రం అప్రమత్తంగా లేకపోతే గాల్లోనే ప్రాణాలు హరి అంటాయి. 30వేల అడుగుల ఎత్తున గాల్లో ఉండగానే రెండు విమానాలు ఎదురెదురుగా వచ్చి దాదాపు ఢీకొన్నంత పనైయ్యింది. అయితే, ఓ విమానం పైలట్లు చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. రెండు రోజుల కిందట టర్కీ మీదుగా ప్రయాణిస్తున్న బ్రిటీష్ ఎయిర్వేస్ విమానం త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడిందని నివేదికలు వెలువడిన తర్వాత శ్రీలంక ఎయిర్లైన్స్ తమ లండన్- కొలంబో విమానాన్ని సురక్షితంగా నడిపినందుకు పైలట్లపై ప్రశంసలు కురిపించింది.
‘‘పైలట్ల అప్రమత్తతతో పాటు విమానంలోని అత్యాధునిక కమ్యూనికేషన్, నిఘా వ్యవస్థ కారణంగా జూన్ 13న యూఎల్ 504 ప్రయాణం సురక్షితంగా సాగింది.. అంతేకాదు, యూఎల్ 504ను నడుపుతున్న పైలట్ల సమయస్ఫూర్తి చర్యను శ్రీలంక ఎయిర్లైన్స్ ప్రశంసించింది.. ఇది యూఎల్ 504లోని ప్రయాణీకులు, సిబ్బంది, పరికరాల భద్రతకు హామీ ఇచ్చింది’’ అని ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
లండన్ నుంచి కొలంబోకు వెళ్తోన్న యూఎల్ 504 విమానం తుర్కియే (టర్కీ) గగనతలంలో ఉన్నప్పుడు త్రుటిలో బ్రిటిష్ ఎయిర్లైన్స్ విమానాన్ని ఢీకొట్టే ప్రమాదం నుంచి తప్పించుకుందని మీడియా నివేదికలు వెలువడిన తర్వాతే శ్రీలంక విమానయాన సంస్థ నుంచి ఈ ప్రకటన వచ్చింది. మొత్తం 275 మంది ప్రయాణికులతో హీత్రూ నుంచి కొలంబోకు బయలుదేరిన విమానం మార్గమధ్యలో తుర్కియే (టర్కీ) గగనతలంలోకి ప్రవేశించిందని నివేదికలు తెలిపాయి.
ఈ సమయంలో విమానం 33,000 అడుగుల ఎత్తులో ఎగురుతుండగా.. 35,000 అడుగులకు పెంచాలని అంకారా ఏటీసీ నుంచి సూచనలు అందాయి. సరిగ్గా అప్పుడే, 250 మందికిపైగా ప్రయాణికులతో దుబాయికి వెళ్తున్న బ్రిటిష్ ఎయిర్వేస్ విమానం కేవలం 15 మైళ్ల దూరంలో 35,000 అడుగుల ఎత్తులో ఎగురుతున్నట్లు గుర్తించి, అంకారాలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి శ్రీలంక విమాన పైలట్లు సమాచారం అందించారు.
అయితే, అంకారా ఏటీసీ రెండుసార్లు తప్పుగా క్లియర్ చేసినప్పటికీ శ్రీలంక పైలట్లు మాత్రం ఎత్తుకు వెళ్లేందుకు నిరాకరించారు. కొద్ది సేపటికే అత్యవసరంగా స్పందించిన ఏటీసీ.. అప్పటికే 35,000 అడుగుల ఎత్తులో మరో విమానం ఉన్నందున శ్రీలంక విమానాన్ని వెళ్లొద్దని సూచించింది. కానీ, అంకారా ఏటీసీ కోరినట్టు యూఎల్ 504 కెప్టెన్ ఎత్తుకు వెళ్లి ఉంటే బ్రిటిష్ ఎయిర్వేస్ విమానాన్ని గాల్లోనే ఢీకొనే అవకాశం ఉంది. ఎందుకంటే అది యూఎల్ కంటే వేగంగా వెళుతోన్నట్టు డైలీ మిర్రర్ వార్తాపత్రిక పేర్కొంది.
కొలంబోలోని బండారునాయకే అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యిందని, సిబ్బందితో పాటు ప్రయాణికులు విమానం నుంచి క్షేమంగా దిగారని, ఘటనపై నివేదిక సమర్పించామని శ్రీలంక ఎయిర్లైన్స్ తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa