ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వడ్డీ రేట్లు పెంచేసిన..అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్

business |  Suryaa Desk  | Published : Fri, Jun 17, 2022, 02:51 AM

అగ్రదేశ మైన అమెరికా కూడా ఆర్థిక నష్టాను ఎదుర్కొనే ప్రయత్నం చేస్తోంది. తాజాగా అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ గత 30 ఏళ్లల్లో ఎప్పుడూ లేనంతగా వడ్డీ రేట్లను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా వడ్డీ రేట్ల పెంపుపై కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందంటూ పేర్కొంది. అంతేకాదు త్వరలోనే ద్రవ్యోల్బణంను 2శాతంకు తీసుకొస్తామనే విశ్వాసం వ్యక్తం చేసింది. మరోవైపు దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి జారుకుంటోందంటూ అంచనా వేసింది. ఇక నిరుద్యోగిత శాతం కూడా రానున్న కొన్ని నెలల్లో పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది.


1994 తర్వాత 75 బేసిస్ పాయింట్ల మేరా వడ్డీ రేట్లు పెంచడం ఇదే తొలిసారి. కరోనా సమయంలో సప్లయ్ మరియు డిమాండ్‌ అంశాలు సమతూకంగా లేవని అభిప్రాయపడిన ఫెడరల్ రిజర్వ్...ద్రవ్యోల్బణం మాత్రం క్రమంగా పెరుగుతూ వచ్చిందని వెల్లడించింది.ఇక ఫెడరల్ రిజర్వ్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఆ సంస్థ ఇచ్చే రుణాలపై ఈ ఏడాది చివరికల్లా 3.4 శాతం మేరా వడ్డీ ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంటే ఈ ఏడాది మార్చిలో 1.9శాతంగా ఉన్న వడ్డీ రేట్లు 3.4 శాతంకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఇక ద్రవ్యోల్బణం సూచీలు కూడా ఈ ఏడాది చివరికల్లా 5.2 శాతంకు పెరుగుతుందని అదే సమయంలో జీడీపీ 1.7 శాతంకు పడిపోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2022లో జీడీపీ 2.8 శాతంగా ఉంటుందని గతేడాది అంచనా వేశారు.


రష్యా ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగడంతో ద్రవ్యోల్బణంపై తీవ్ర ప్రభావం చూపిందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా మందగించిందని పేర్కొన్నారు. ఇక కరోనా కారణంగా చైనాలో విధించిన లాక్‌డౌన్‌ కూడా సప్లయ్ చైన్స్‌ కార్యకలాపాలపై ప్రభావం చూపిందని చెప్పుకొచ్చారు.రష్యా ఉక్రెయిన్ యుద్ధం సమయంలో ఇంధనంపై ద్రవోల్బణం ఎఫెక్ట్ బాగా పడిందని చెప్పారు.పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధించడంతో ఇటు ఆహార ధరలు అటు ఇంధన ధరలు విపరీతంగా పెరిగినట్లు ఆర్థిక నిపుణులు చెప్పారు. ఇక అమెరికాలో ఇంధనం ధరలు గ్యాలన్‌కు 5 డాలర్లతో రికార్డు సృష్టించినట్లు పేర్కొన్నారు.


వినియోగదారుల ధరల గరిష్ట స్థాయి పెంపునకు మార్చి నెల చివరిగా ఉంటుందని ఆర్థికవేత్తలు భావించారు, అయితే మే నెలలో రేటు మళ్లీ పెరిగింది, తాజాగా 12 నెలల్లో 8.6 శాతం పెరిగింది దీంతో టోకు ధరలు కూడా పెరిగాయి. వీటన్నిటికీ కారణం ఇంధనం ధరలు, గ్యాస్ ధరలు పెరగడమే కారణంగా చెప్పుకొచ్చారు. చివరిగా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచిందనంటే వినియోగదారులు ఇక పెద్ద మొత్తంలో కొనుగోళ్లు నిలిపివేస్తారు. దీంతో ప్రజలు కూడా పెట్టే అధిక ఖర్చులను తగ్గించుకునే అవకాశం ఉంది. ధరలను నియంత్రిస్తూ స్థిరంగా ఉంచాలన్న ఉద్దేశంతోనే ఫెడరల్ రిజర్వ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.అమెరికా ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు ఇదొక అస్త్రంగా వినియోగించినట్లు నిపుణులు చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa