పోస్ట్ మెన్ కు ఫోన్ కొడితే చాలు మీ ఇంటి వద్దే మీ ఆధార్ కార్డు దరఖాస్తు నమోదు అవుతుంది. అయితే ఇది అందరికీ కాదు. కేవలం ఐదేళ్లలోపు ఉండే పిల్లలకు మాత్రమే వర్తిస్తుంది. చిన్నపిల్లలు సహా ప్రతి ఒక్కరికీ ఆధార్ తీసుకోవడం ఇప్పుడు అవసరంగా మారింది. ఆధార్ సర్వీస్ సెంటర్లకు వెళ్లి ఆధార్ తీసుకోవాల్సి వస్తుండగా.. చిన్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు. వారిని ఆధార్ కేంద్రానికి తీసుకెళ్లడం, అక్కడ వేచి ఉండాల్సి రావడం పిల్లలకు ఇబ్బందిగా మారింది. దీంతో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆధార్ తీసుకోవడం లేదు. ఈ విషయాన్ని గమనించిన కేంద్రం ఐదేళ్ల లోపు చిన్నారులకు.. వారి ఇంటికి వెళ్లే ఆధార్ నమోదు చేసేందుకు పోస్టల్ శాఖకు అనుమతి ఇచ్చింది.
ఐదేళ్లలోపు చిన్నారులకు ఆధార్ తీసుకోవడం కోసం మీరు చేయాల్సిందల్లా.. సమీపంలోని పోస్ట్ ఆఫీసులో సమాచారం ఇవ్వడమే. లేదంటే పోస్టుమెన్కు ఫోన్ చేసినా చాలు.. వారే ఇంటికి వచ్చి వివరాలు నమోదు చేస్తారు. ఇందుకోసం పిల్లల బర్త్ సర్టిఫికెట్, తల్లిదండ్రుల బయోమెట్రిక్ వివరాలను పోస్టల్ సిబ్బందికి అందించాల్సి ఉంటుంది. వాటి ఆధారంగా పోస్టల్ సిబ్బంది ఆధార్ కార్డ్ అందించే ఏర్పాట్లు చేస్తారు. పోస్టల్ శాఖ ఈ సేవలను ఉచితంగా అందిస్తుండటం గమనార్హం.
ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ పరికరం ద్వారా పోస్ట్మెన్లకు ఆధార్ నమోదు ప్రక్రియ గురించి పోస్టల్ శాఖ ట్రైనింగ్ కూడా ఇచ్చింది. అయిదేళ్లలోపు వయసున్న చిన్నారులను గుర్తించడం కోసం.. వారికి ఆధార్ ఇవ్వడం కోసం.. వివిధ శాఖలతో పోస్టల్ శాఖ సమన్వయం చేసుకుంటోంది. మహిళా శిశు సంక్షేమం, విద్యాశాఖల సమన్వయంతో పోస్టల్ సిబ్బంది అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు. ముందుగా మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఆధార్ నమోదు ప్రక్రియను పూర్తి చేయనున్నారు.
చిన్న పిల్లల వేలి ముద్రలు స్పష్టంగా ఉండవనే ఉద్దేశంతో ఆధార్ నమోదులో అయిదేళ్ల లోపు వయసున్న చిన్నారులకు బయోమెట్రిక్ నుంచి మినహాయింపు ఇచ్చారు. దీంతో వారి తల్లిదండ్రుల బయోమెట్రిక్ తీసుకొని.. పిల్లలకు నిర్ణీత వయసు వచ్చాక వేలి ముద్రలను సేకరించి ఆధార్ను అప్డేట్ చేస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa