ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ పోస్ట్ ప్రాధాన్యత లేనిదిగా భావించడంలేదు: ఏ.బి.వెంకటేశ్వర రావు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 17, 2022, 04:48 PM

తనకు కేటాయించిన పోస్ట్ ప్రాధాన్యత లేనిదిగా తాను భావించడంలేదని, కాకపోతే ఈ శాఖపై తనకు ఇంకా అవగాహన రావాల్సి ఉందని ఐపీఎస్ అధికారి ఏ.బీ.వెంకటేశ్వరరావు వెల్లడించారు. ఏపీ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు అనుకున్నది సాధించారు. దాదాపు మూడేళ్ల తర్వాత మళ్లీ విధుల్లోకి వచ్చారు.. సుప్రీం కోర్టు తీర్పు తర్వాత ఏపీ ప్రభుత్వం ఆయన్ను ప్రింటింగ్‌ స్టేషనరీ, స్టోర్స్‌ పర్చేస్‌ డిపార్ట్‌మెంట్‌కు కమిషనర్‌గా నియమించింది. దీంతో ఆయన ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. మూడేళ్ల తర్వాత తిరిగి బాధ్యతలు స్వీకరించడం ఆనందంగా ఉందన్నారు ఏబీ. తనకు ఈ శాఖ పట్ల పూర్తి అవగాహన లేదన్నారు.


ముత్యాలంపాడులోని ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్‌‌కు గతంలో ఘనకీర్తి ఉండేదని.. ఉమ్మడి రాష్ట్రంలో ప్రింటింగ్ విభాగం ఆదరణ పొందుతూ వచ్చిందని గుర్తు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత మిగిలిన ఈ విభాగంలోని స్థితి గతులను అధ్యయనం చేస్తానని చెబుతున్నారు. గతంలో ప్రభుత్వ పాఠ్య పుస్తకాలు ఇక్కడే ప్రింటింగ్ అయ్యేవని.. కానీ ప్రస్తుతం కార్యకలాపాలపై సిబ్బందితో చర్చించి అభివృద్ధికి కృషి చేస్తాను అన్నారు. తనకు ప్రాధాన్యత లేని పోస్టింగ్‌గా భావించడంలేదన్నారు వెంకటేశ్వరరావు. నియామకాల విషయంలో ప్రభుత్వం తన ఆలోచనల మేరకు చేస్తుందని. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఏబీ వెంకటేశ్వరరావు కార్యాలయాన్ని పరిశీలించారు.


ఏబీ వెంకటేశ్వరరావు గత ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉంటూ అక్రమాలకు పాల్పడ్డారనే అభియోగాలపై జగన్ సర్కార్ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా ఏబీ వెంకటేశ్వరరావు హైకోర్టును ఆశ్రయించారు.. తర్వాత సుప్రీం కోర్టులో కూడా ఈ సస్పెన్షన్ వ్యవహారంపై విచారణ జరిగింది. ఆ తర్వాత వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ను రద్దు చేస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది.. ఆయన్ను వెంటనే సర్వీసులోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ తర్వాత ఏబీపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. తర్వాత కొద్దిరోజులు ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదు. ఈ క్రమంలో ఆయన రెండుసార్లు సీఎస్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు.


ఐపీఎస్‌ ఏబీ వెంకటేశ్వరరావుకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ప్రింటింగ్‌ స్టేషనరీ, స్టోర్స్‌ పర్చేస్‌ డిపార్ట్‌మెంట్‌కు కమిషనర్‌గా నియమిస్తూ ఏపీ సీఎస్ సమీర్ శర్మ ఉత్తర్వులు విడుదల జేశారు. ఆ స్థానంలో ఉన్న జీ.విజయ కుమార్‌ను హోమ్‌ శాఖ స్పెషల్‌ సెక్రటరీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇవాళ ఆయన బాధ్యతలు స్వీకరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa