రానున్న కొద్ది రోజుల్లో అగ్నిపథ్ రిక్రూట్మెంట్ ప్రారంభం కానుందని, యువత ఇందుకోసం ప్రిపేర్ కావాలని భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సూచించారు. అగ్నిపథ్ పథకం ద్వారా మిలిటరీ రిక్రూట్మెంట్ త్వరలోనే ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. అగ్నిపథ్ పథకంపై ఎలాంటి అపోహలు వద్దని, ఆందోళనలను యువత విరమించాలని కోరారు. అంతేగాక, అగ్నిపథ్ పథకం కింద రిక్రూట్మెంట్ కోసం ప్రిపేర్ కావాలని కేంద్రమంత్రి రాజ్నాథ్ సూచించారు. అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా యువకులు నిరసనలు తెలుపుతున్న నేపథ్యంలో రాజ్నాథ్ ఈ మేరకు ప్రకటన చేయడం గమనార్హం. ఈ పథకం యువతకు బంగారు అవకాశమని ఆయన చెప్పారు. ఈ పథకాన్ని తీసుకువచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోడీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు.
దేశానికి, సమాజానికి సేవ చేసేందుకు అగ్నిపథ్ అనేది బంగారు అవకాశమని రాజ్నాథ్ వ్యాఖ్యానించారు. గత రెండేళ్లుగా ఈ రిక్రూట్ మెంట్ ఆగిపోయిందన్నారు. చాలా మంది యువతకు అవకాశం ఇచ్చేందుకే ప్రధాని నరేంద్ర మోడీ.. వయో పరిమితిని 21-23కు పెంచారని తెలిపారు. ఇందుకు ప్రధాని నరేంద్ర మోడీకి తాను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు.
రానున్న కొద్ది రోజుల్లో అగ్నిపథ్ రిక్రూట్మెంట్ ప్రారంభం కానుందని, యువత ఇందుకోసం ప్రిపేర్ కావాలని రాజ్ నాథ్ సింద్ సూచించారు. ఇదిలావుంటే అగ్నిపథ్ పథకం కింద తీసుకున్న అభ్యర్థుల్లో కేవలం 25 శాతం మందిని పర్మినెంట్ చేసి, మిగితావారిని నాలుగేళ్లకు ఉద్యోగం నుంచి పంపించడంపై యువత ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, దీనిపై ప్రభుత్వం గురువారం స్పష్టతనిచ్చింది. ఉద్యోగ భద్రత గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది.
గత మూడు రోజులుగా దేశ వ్యాప్తంగా యువత ఆందోళనలు చేపట్టింది. పలు రాష్ట్రాల్లో రైళ్లుకు నిప్పుపెట్టడంతో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. వాహనాలను కూడా తగలబెట్టి విధ్వంసానికి పాల్పడ్డారు. శుక్రవారం కూడా దేశ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. బీహార్, ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో యువత ఆందోళనలు చేస్తున్నారు. తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఓ రైలుకు నిప్పుపెట్టడంతో పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో ఒకరు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa