సినిమా టిక్కెట్ల ధర రగడ సమసిపోకముందే తాజాగా ఆన్ లైన్ సినిమా టిక్కెట్ల వ్యవహారంలో ప్రభుత్వానికి, సినీ పరిశ్రమ ప్రముఖులకు మధ్య కోల్డ్ వార్ సాగుతోంది. దీంతో తాజాగా ఏపీలో సినిమా ఆన్లైన్ టికెట్ల అమ్మకాల వ్యవహారం మరోసారి హైకోర్టుకు చేరింది. టికెట్లను ప్రభుత్వమే విక్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది తీసుకొచ్చిన సవరణ చట్టం.. ఆ తర్వాత ఉత్తర్వులను సవాలు చేస్తూ బిగ్ట్రీ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో పాటూ డిప్యూటీ జనరల్ మేనేజరు సందీప్ అన్నోజ్వాలా హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు.. ప్రతివాదులుగా ఉన్న న్యాయ, శాసనసభ కార్యదర్శి, హోంశాఖ ముఖ్యకార్యదర్శి, ఏపీ స్టేట్, ఫిల్మ్, టెలివిజన్, ఏపీఎస్ఎఫ్టివీటిడీసీ, ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్లకు నోటీసులు ఇచ్చింది. కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించిన కోర్టు.. ఈనెల 27కు వాయిదా వేసింది.
టికెట్ విక్రయం ద్వారా సర్వీసు ఛార్జీ కింద వచ్చే రూ.2లో ప్రభుత్వానికి రూ.1.97వెళుతుందని.. తమకు కేవలం మూడు పైసలు మాత్రమే వస్తుందని పిషనర్ల తరపు లాయర్ వాదనలు వినిపించారు. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన విధానంలో 80శాతం ప్రభావితం అయ్యేది ఆన్లైన్ వేదికగా టికెట్లను విక్రయిస్తున్న పిటిషనర్ సంస్థలే అన్నారు. ఈ విధానం అమలు చేసేందుకు ప్రభుత్వానికి తగిన వేదిక లేదన్నారు. గతంలో మల్టీప్లెక్స్ థియేటర్ల యాజమాన్యాలు ఇదే వ్యవహారంపై వ్యాజ్యం దాఖలు చేశాయని.. దానిలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదని ధర్మాసనం గుర్తు చేసింది. ఈ నెల 27న జరిగే విచారణలో కోర్టు ఎలా స్పందిస్తుంది అన్నది చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa