ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్నికలంటే ఓట్లేసుకొని పారిపోవడం కాదు: కేతిరెడ్డి వెంకట రామిరెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jul 03, 2022, 03:39 PM

ఎన్నికలంటే ఓట్లేసుకొని పారిపోవడం కాదని జనాల దగ్గరకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకోవాలని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట రామిరెడ్డి అన్నారు. తమ నాయకులు, కార్యకర్తలను అదుపులో ఉంచుకుని ప్రగతి దిశగా అడుగులు వేస్తున్నామని.. లేదంటే పల్లెల్లో తరిమి కొట్టే పరిస్థితి ఉండేదని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలన్నీ కలిసి వచ్చినా సరే.. ఈసారి కూడా తాను ధర్మవరం ఎమ్మెల్యేగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. తాను ధర్మవరం ఎమ్మెల్యేగా గెలిచిన రెండు నెలలకే ఓడిన వ్యక్తి అస్సాం పార్శల్ అయ్యారని సెటైర్లు పేల్చారు. అలాంటి వ్యక్తి తన గురించి మాట్లాడే అర్హత లేదన్నారు.


ప్రతిపక్ష పార్టీ నేతలు తనపై చేస్తున్న ఆరోపణల్ని దమ్ముంటే నిరూపించాలని సవాల్ విసిరారు ధర్మవరం ఆయన. 2006లో రాజకీయాల్లోకి వచ్చానని.. తన తండ్రి చనిపోయిన తర్వాత రాజకీయాలంటే ఇష్టం లేకపోయినా రావాల్సి వచ్చిందన్నారు. తన తల్లిదండ్రులు ఫ్యాక్షన్‌కు దూరంగా ఉండాలని తనను విదేశాల్లో చదివించారని, తన తండ్రి 18 ఏట హత్య కేసులో ఇరుక్కుని జీవితం నాశనం చేసుకున్నారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితులతో ఫ్యాక్షన్ ఓ గ్రూపుకు అండగా నిలబడి నాయకుడిగా ఎదిగారని, కానీ ఇప్పటికీ మనశ్శాంతి లేదన్నారు. తన తండ్రి చివరికి అనుకోని పరిస్థితుల్లో ఇదే ఫ్యాక్షన్‌కు   బలయ్యారన్నారు కేతిరెడ్డి. అలా ఇష్టం లేకపోయినా సరే రాజకీయాల్లోకి రావాల్సి వచ్చిందని.. రాజకీయాల్లోకి వచ్చే సమయానికి తనకు ఏం తెలియదన్నారు. ధర్మవరంలో పోటీలో ఉన్న పరిటాల శ్రీరామ్, వరదాపురం సూరి, తాను ఫ్యాక్షనిజంలో తండ్రులను పోగొట్టుకున్నామన్నారు. వరదాపురం సూరి చేసిన పనులకు ఆయన తండ్రిని పోగొట్టుకున్నారని చెప్పుకొచ్చారు. సూరి ఆరోపణలు చేసే ముందు నిజా, నిజాలు తెలుసుకోవడం మంచిదన్నారు.


తనపై చేస్తున్న ఆరోపణల విషయంలో ప్రమాణం చేసేందుకు తాను సిద్ధమని.. సూరి కూడా సిద్దమా అంటూ సవాల్ విసిరారు. ధర్మవరం నియోజకవర్గం ప్రజలకు అన్ని విషయాలు తెలుసని.. వారే తగిన నిర్ణయం తీసుకుంటారన్నారు. గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమానికి వెళ్తే.. కబ్జాలకు పాల్పడుతున్నానని ఆరోపిస్తున్నారని కేతిరెడ్డి ఇటీవల మండిపడ్డారు. ఎవరైనా రోడ్డు వేస్తే కబ్జా ఎలా అవుతుందని ఏ పార్టీ వాళ్లైనా అరడుగు కబ్జా చేసినట్టు నిరూపించాలని ఛాలెంజ్ చేశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa