ప్రధాని కార్యాలయానికి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అలా ఫిర్యాదు చేయగానే వెంటనే ఏపీలోని వైసీపీ ప్రభుత్వం అప్రమత్తమైనట్లు కనిపిస్తోంది. ప్రధాని మోదీ భీమవరం పర్యటన సందర్భంగా తనపై దాడికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటూప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) అదనపు కార్యదర్శికి (ఏఎస్) వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు లేఖ రాశారు. ‘స్వాతంత్య్ర అమృత మహోత్సవాలను పురస్కరించుకొని అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలకు ప్రధాని 4న వస్తున్నారు. దీనిలో పాల్గొనేందుకు స్థానిక ఎంపీ హోదాలో నేను వెళ్లాల్సి ఉంటుంది. భీమవరంలోని నా ఇంటి నుంచి 500 మీటర్లు నడిచేలా సమీపంలోని రోడ్డును తవ్వేశారు. ఈ దూరంలో నాపై దాడికి యత్నిస్తున్నట్లు అనుమానముంది. నాపై ఎలాంటి కుట్రలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతున్నా’ అని రఘురామ లేఖలో కోరారు.
ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల్లో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఏర్పాటుచేసిన ఆయన విగ్రహాన్ని ప్రధాని నరేంద్రమోదీ సోమవారం(జులై 4)న ప్రారంభించనున్నారు. 34వ వార్డులోని ఏఎస్ఆర్ నగర్ మునిసిపల్ పార్కులో క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో సుమారు రూ.3కోట్ల వ్యయంతో 30 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. అయితే ఈ కార్యక్రమానికి స్థానిక ఎంపీ హోదాలో తాను హాజరుకానున్నట్లు నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. ఈ పర్యటన సందర్భంగా తనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి చిక్కులు రాకుండా ఆయన ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రఘురామ... నేను భీమవరం రావడం ఖాయమేనని స్పష్టం చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం కుట్రల నేపథ్యంలో ఎటు నుంచి ఎలా వస్తాననేది ఇప్పుడే చెప్పలేనన్నారు. మరోవైపు రఘురామ ఇంటి సమీపంలో తవ్విన రోడ్డును స్థానిక అధికారులు హుటాహుటిన పూడ్చివేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్మీడియాలో వైరల్గా మారడం, ఇదే విషయమై రఘురామ ప్రధాని కార్యాలయానికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో ప్రభుత్వం దిగొచ్చింది. శనివారం స్థానిక అధికారులు ఆ రోడ్డును పూడ్చివేసి రాకపోకలు పునరుద్ధరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa